ఢిల్లీ రోహిణీ లోని రిథాలా ఏరియాలో ఐదంతస్తుల భవనంలో మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించి నలుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. రోహిణీ సెక్టార్ 5 ఏరియాలో ఈ భవనం ఉంది. 16 అగ్నిమాపక శకటాలు రంగం లోకి దిగి మంటలను ఆర్పడానికి ప్రయత్నించాయి. ఈ ప్రమాదానికి కారణం ఏమిటో తెలియదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ ఫైర్సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ పేర్కొన్నారు. శిథిలాల్లో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమో అని గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు.
బుధవారం మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో మొదటి అంతస్తు నుంచి మసిబారిన మూడు మృతదేహాలను వెలికి తీయగలిగారు.తరువాత మరో మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం 6 గంటలకు దిగువ అంతస్తుల్లో మంటలు అదుపు లోకి వచ్చాయని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. మూడు, పై అంతస్తుల్లో ఇంకా మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భవనాన్ని చల్లదనం చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఎడిఒ రాజేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ భవనానికి అగ్నిప్రమాద భద్రతా సర్టిఫికేట్ లేదని, ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రజలను ఖాళీ చేయించే అవకాశం లేదని తెలిపారు.