ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లను కుదిపేస్తున్నాయి. హిమాచల్ లోని 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది. శిమ్లాలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ముందుజాగ్రత్త చర్యగా ఇందులోని నివాసితులను అధికారులు ముందే అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపం లోని మరిన్ని భవనాలకూ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
హిమాచల్ ప్రదేశ్లో గత 24 గంటల వ్యవధిలో భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 129 రహదారులు మూతపడ్డాయి. మండీ, సిర్మౌర్ జిల్లాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోలన్లో ఓ వంతెన కొట్టుకుపోయింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో కాంగ్రా, మండీ, సోలన్, సిర్మౌర్జిల్లాల్లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచి రాష్ట్రంలో 20 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. 2023లో వర్షాకాలంలో 550 మంది ప్రాణాలు కోల్పోయారు.
చార్థామ్ యాత్ర మళ్లీ ప్రారంభం
ఉత్తరాఖండ్లో వరదల కారణంగా నిలిచిపోయిన చార్ధామ్ యాత్ర సోమవారం పునః ప్రారంభమైంది. 24 గంటల నిషేధాన్ని ఎత్తివేసినట్టు అధికారులు ప్రకటించారు. ఉత్తర్కాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయ్ బైండ్లో ఆదివారం కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. ఈ సంఘటనలో గల్లంతైన ఏడుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. యమునోత్రి రహదారికి మరమ్మతులు చేపట్టినట్టు తెలిపారు.