Thursday, June 19, 2025

చుట్టుముడుతున్న యుద్ధాగ్ని జ్వాలలు

- Advertisement -
- Advertisement -

రష్యాతో భారత్ తన సంబంధాలు తెంచుకోవాలని చెప్పడం ద్వారా అమెరికా దాదాపుగా భారత్‌ను హెచ్చరించినట్లుగానే భావించాలి. అమెరికా వాణిజ్య కార్యదర్శి లుత్నిక్ మాటలు డొనాల్డ్ ట్రంప్ మాటలుగానే భావించాలి. రష్యా వద్ద ఆయుధాలు కొనుగోలు చేయడం వాషింగ్టన్‌ను వ్యతిరేకించడమేనన్న అమెరికా వ్యాఖ్యలు అనుచితం. అమెరికా తన ఆర్థిక దివాళాకోరుతనాన్ని ట్రేడ్ డీల్స్ ద్వారా తేటతెల్లం చేస్తున్నది. భారత్‌పై ప్రతీకార సుంకాలను విధిస్తూ ఇబ్బందిపెట్టాలని చూసిన ట్రంప్‌కు భారత్ కూడా ప్రతీకార సుంకాలతోనే గుణపాఠం నేర్పడానికి సంసిద్ధమైనది. చిరకాల మిత్రులైన భారత్- రష్యాలను విడదీయాలనే దుర్మార్గమైన ఆలోచనకు అమెరికా స్వస్తి చెప్పాలి. ఉగ్రమూకలకు స్వర్గధామమైన పాకిస్తాన్ పట్ల అమెరికా ఉదార స్వభావాన్ని ప్రదర్శించడం సిగ్గుచేటు. ఇటీవల పుతిన్- అజిత్ దోవల్ మధ్య జరిగిన సంభాషణలు అమెరికాకే కాకుండా చైనా, పాక్, బ్రిటన్‌లకు వెన్నులో వణుకు పుట్టించాయి.

ఒక వైపు అమెరికా, బ్రిటన్ మరికొన్ని యూరప్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ, భారత్‌లో మారణహోమం సృష్టిస్తున్న పాక్‌ను మందలించకుండా భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాల (Terrorist activities) కు వెన్నుదన్నుగా నిలుస్తున్న పాక్‌ను ఎదిరించేందుకు రష్యాతో ఆయుధ ఒప్పందం కుదుర్చుకుంటున్న భారత్‌పై ఈర్ష్యాద్వేషాలను ప్రదర్శిస్తున్న అమెరికా వైఖరి అసమంజసం. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎంతో అందమైన ప్రాంతం. ఉగ్రవాదులతో, జిహాదీ శిక్షణలో ఎలాంటి అభివృద్ధి సాధించకుండా పిఒకె నిస్తేజంగా మారిపోయింది. పిఒకె ప్రజలకు తినడానికి తిండిలేదు. విద్య, ఉపాధి అవకాశాలు లేవు. భారత్‌లోని జమ్మూ కశ్మీర్ ఇందుకు విరుద్ధం.కశ్మీర్ ప్రజలు టూరిజంతో ఉపాధి అవకాశాలు పొందుతున్నారు.

ఉగ్రవాదం వలన జీవితాలు ఎంత దుర్భరంగా మారతాయో అక్కడ ప్రజలకు అర్ధమైనది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొంత కాలం అలజడులు చెలరేగినా అక్కడ జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు కశ్మీర్ ప్రజల్లో మార్పును తెచ్చిన మాట కాదనలేని సత్యం. ఎవరో కొద్ది మంది చేసే పనుల వలన కశ్మీర్‌లో ఏదో జరిగిపోతుందనుకోవడం విడ్డూరం. జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధిని గమనించిన తరువాత పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు కూడా భారత్‌లో విలీనం కావాలని కోరుకుంటున్నారు. జై శంకర్, యోగి ఆదిత్యనాథ్, రాజ్ నాథ్ సింగ్ వంటి వారు పిఒకె స్వాధీనం గురించి ఇదివరకే తమ అభిప్రాయాలను కుండబద్దలు గొట్టినట్టు చెప్పారు. పిఒకెను భారత్ స్వాధీనం చేసుకుంటుందా? ఇందుకు చైనా, అమెరికాలు అభ్యంతరం చెప్పి, పాక్‌కు ఆయుధాలు సరఫరా చేసి భారత్‌పై యుద్ధానికి ప్రేరేపిస్తాయా? అనే విషయం తేలాలి.

రష్యా- ఉక్రెయిన్ల మధ్య గత మూడున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపడం అమెరికాకు చేతకాలేదు. పైగా ట్రంప్‌ను జెలెన్‌స్కీ ప్రత్యక్షంగానే విమర్శించిన విషయం మరవలేం. తన మద్దతు లేకపోతే ఉక్రెయిన్ యుద్ధం చేయలేదని డాంబికాలు పలికిన అమెరికాను సవాల్ చేస్తూ, మునుపెన్నడూ లేని విధంగా రష్యాపై ఉక్రెయిన్ స్పైడర్ వెబ్ ఆపరేషన్‌ను చేపట్టి రష్యాను భయపడేలా చేసింది.రష్యాలోని కీలకమైన క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్ కూల్చింది. 41 యుద్ధ విమానాలు, ఒక బ్రిడ్జిని ధ్వంసం చేసి పటిష్టమైన రక్షణ వ్యవస్థ కలిగిన రష్యాకు సవాల్ విసిరిన ఉక్రెయిన్‌కు నాటో దేశాలు సహకారం అందించడం వలన జరిగే మహావిలయాన్ని ఊహించగలమా?రష్యా కూడా ఉక్రెయిన్‌కు చెందిన వందలాది మంది సైనికులను హతమార్చినట్టు ప్రకటించుకుంది. ఉక్రెయిన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా చేసిన హెచ్చరిక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేం.

రష్యాకు యుద్ధంలో సహాయం చేయడానికి ఉత్తర కొరియా సంసిద్ధత వ్యక్తం చేసింది. వేలాది సైన్యం, ఆయుధాలతో కిమ్ రష్యాకు అండగా ఉండబోతున్నారు. ఉక్రెయిన్ రష్యాపై ఆకస్మికంగా దాడి చేసి ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేయడం అవాంఛనీయ పరిణామంగా భావించాలి. అహం దెబ్బతిన్న రష్యా ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో విరుచుకుపడడానికి సిద్ఢంగా ఉంది. రష్యా రిటాలియేషన్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేం. ఈ పరిణామాల వలన అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్ పక్షాన నిలబడి భారీ యుద్ధానికి తెరతీసే అవకాశముంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అందరూ భావిస్తున్న తరుణంలో అనుకోని విధమైన మలుపులు తిరుగుతూ ప్రపంచాన్ని భయానకమైన వాతావరణంలోకి నెట్టింది. ఉక్రెయిన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్‌కు స్పష్టం చేసారు. ఎక్స్ ద్వారా ట్రంప్ ఈ విషయాన్ని తేల్చిచెప్పారు. భారత్ -రష్యా సంబంధాలను అమెరికా జీర్ణించుకోలేకపోతున్నది.

భారత దేశానికి అంతర్జాతీయంగా అన్నివిధాలుగా సహకరిస్తున్న ఏకైక విశ్వసనీయమైన దేశం రష్యా. అలాంటి రష్యాకు మన దేశం ఎంతో రుణపడి ఉంది. 1971లో జరిగిన ఇండో- పాక్ యుద్ధంలో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు పాకిస్తాన్‌కు మద్దతు తెలిపినా, అప్పటి సోవియట్ యూనియన్ భారత్‌కు అన్ని విధాలా సాయంచేసి నిజమైన స్నేహానికి నిర్వచనం చెప్పింది. అప్పటి సోవియట్ యూనియన్ నుంచి నేటి రష్యా వరకు భారత్‌కు వెన్నంటి ఉన్న మిత్ర దేశంతో భారత్‌ను వేరుచేయాలని అమెరికా విఫల ప్రయత్నాలు చేస్తున్నది. ఆసియా, ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉన్న రష్యా ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో ఒక భాగం. కొన్ని దేశాల కుట్రల వలన, మిఖాయిల్ గోర్బచేవ్ విధానాల వలన ఎంతో ఖ్యాతి గాంచిన సోవియట్ యూనియన్ విడిపోయింది.15 కామన్ వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్‌లో రష్యా ఒక కీలకమైన దేశం.

సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన రష్యా ఈనాటికీ మిగిలిన ప్రాంతాల కంటే అత్యధిక ఆయుధ, సైనిక బలగం గల దేశం. అప్పటి సోవియట్ యూనియన్ మాదిరిగా రష్యా కూడా ఒక అగ్రరాజ్యం. ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంగల దేశంగా మైదానాలతో, వ్యవసాయ భూములతో, సహజ వనరులతో తులతూగుతున్న రష్యా అంటే ఈనాటికీ కొన్ని దేశాలకు గిట్టదు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు రష్యాకు బద్ధశత్రువులు. ఇటీవల కాలంలో రష్యాపట్ల స్నేహ వైఖరిని ప్రదర్శించినట్లు నటించిన ట్రంప్ తన దుర్బుద్ధిని చాటుకున్నారు. రష్యా కు భారత్ మరింత సన్నిహితంగా మెలగడం అమెరికాకు నచ్చడంలేదు. అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు ట్రంప్ అధికారంలోకి రావడానికి కృషి చేసారు. ఎన్నికల తర్వాత అక్రమ వలసదారుల పేరుతో భారతీయులకు సంకెళ్ళు వేసి, యుద్ధ విమానాల్లో వారిని భారత్‌కు పంపించి, ఘోరంగా అవమానించాడు. భారత్‌ను ప్రశంసిస్తూ, మోడీ తన మిత్రుడంటూనే అమెరికా అధ్యక్షుడయ్యాక ట్రంప్ భారత్‌కు వెన్నుపోటు పొడిచాడు.

ట్రంప్ చేష్టలను తట్టుకోలేక అతని ఆప్తమిత్రుడైన ఎలాన్ మస్క్ కూడా ట్రంప్‌ను అభిశంసించి, గద్దె దించాలని, జెడి వాన్స్‌ను అధ్యక్ష స్థానంలో నిలబెట్టాలని ప్రయత్నించడం గమనార్హం. భారత్ విషయంలో కూడా ట్రంప్ ధోరణి సముచితంగా లేదు. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అత్యధిక జనాభా గల దేశంగా భారత్ తన సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నది. ఈ క్రమంలో రష్యా భారత్‌కు అన్ని విధాలా అండగా ఉంటున్నది. చైనా, పాకిస్తాన్, అజర్ బైజాన్, బంగ్లాదేశ్, టర్కీ వంటి దేశాలు భారత్‌పట్ల అకారణ విద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఒకప్పుడు ఇండో- చీనీ భాయ్‌భాయ్ అంటూనే 1962లో భారత్‌తో యుద్ధానికి తలపడి, భారత్ భూభాగాలను ఆక్రమించి చైనా నమ్మకద్రోహం చేసింది. టిబెట్ బౌద్ధ గురువు దలైలామాకు భారత్ ఆశ్రయమివ్వడమనే అంశంతో చైనా భారత్‌తో యుద్ధానికి దిగిందనే వాదనలో పసలేదు.

భారత్ లోని ఈశాన్య ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా నాడు చైనా యుద్ధం చేసింది. చికెన్ నెక్‌గా పిలవబడుతున్న సిలిగురి కారిడార్‌ను వివాదాస్పదం చేసి ఈశాన్య భారతాన్ని మింగేయడానికి డ్రాగన్ దేశం విస్తృతంగా ప్రయత్నిస్తున్నది. భారత భూభాగాలను తమవిగా పేర్లు మార్చుకుంటూ భౌగోళిక పటాలను సృష్టిస్తున్నది. పాక్‌తో అంటకాగుతూ భారత్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తున్నది.ఇక పాకిస్తాన్ విషయం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పటికీ, భారత్‌ను ఇంకా ఉగ్రవాదంతో ఇబ్బందులకు గురిచేస్తున్నది. భారత్‌లో కశ్మీర్ విలీనం రాజా హరిసింగ్ నేతృత్వంలో చట్టబద్ధంగా జరిగినా కశ్మీర్‌లోని కొంత భూభాగాన్ని పాక్ ఆక్రమించుకుంది. అదే పాక్ ఆక్రమిత కశ్మీర్. పాక్ ఆక్రమిత కశ్మీర్ కేవలం ఉగ్రవాదులకు నిలయం.

ఇక్కడ నుండే ఉగ్రవాద కార్యకలాపాలను పాక్ కొనసాగిస్తూ, ఎల్‌ఒసివద్ద కాల్పులు జరుపుతూ, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, ఉగ్రవాదులను కశ్మీర్‌లోకి ప్రవేశపెట్టి, భారత్‌లో అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నది. పహల్గాం దారుణ మారణకాండకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌కు బుద్ధి చెప్పింది. భారత్ ఆయుధ శక్తికి బెంబేలెత్తిన పాక్ కాల్పుల విరమణకు ప్రతిపాదన చేయడంతో భారత్ తాత్కాలికంగా శాంతించింది. అయినప్పటికీ పాక్, పాక్‌కు వత్తాసు పలుకుతున్న శత్రుదేశాల కుయుక్తులనుండి దేశాన్ని కాపాడుకోవడానికి భారత్ తన మిత్రదేశమైన రష్యాతో ఆయుధాల విషయంలో సంప్రదింపులు జరుపుతున్నది. అమెరికాకు భారత్ వైఖరి నచ్చడం లేదు.

రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపలేని అమెరికా తానేదో భారత్‌ను ట్రేడ్ డీల్ ద్వారా బెదిరించి, దారికి తెచ్చానని చెప్పడం విడ్డూరం. ఏదిఏమైనప్పటికీ వర్తమాన ప్రపంచం యుద్ధాల రూపంలో ఒక పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరించే అమెరికా సమస్యను మరింత జటిలం చేస్తున్నది. డొనాల్డ్ ట్రంప్ మాటలు చేష్టలు యుద్ధాలను ఆపకపోగా, ఆయుధ వ్యాపారానికి యుద్ధాలను వాడుకుంటున్న దాఖలాలు కనబడుతున్నాయి. ఐక్యరాజ్య సమితితోపాటు, బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన కొన్ని దేశాలు ప్రస్తుత యుద్ధ సంక్షోభాన్ని నివారించడానికి ఎలాంటి కృషి చేయడం లేదు. ఇజ్రాయెల్- పాలస్తీనా, రష్యా- ఉక్రెయిన్, ఇండో- పాక్‌ల మధ్య ఏర్పడిన తీవ్రమైన సంఘర్షణను తేలిగ్గా తీసుకోవడం ఆక్షేపణీయం.

  • సుంకవల్లి సత్తిరాజు
    9704903463
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News