ఈశాన్య రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడంతో దాదాపు 25 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. అస్సాం రాజధాని గౌహతిలో బురద కొండచరియలు విరిగిపడి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు సహా ఐదుగురు మరణించారు. వరదల కారణంగా గోలాఘాట్లో ఇద్దరు, లఖింపూర్లో ఒకరు సహా మరో ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. ఇక, అరుణాచల్ ప్రదేశ్లో సంభవించిన భారీ వరదల్లో ఓ వాహనం కొట్టుకుపోవడంతో ఏడుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో మునిగిపోయి చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.
గత 24 గంటల్లో మిజోరం, త్రిపుర, మేఘాలయలో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు.