మధ్యాహ్నం ఎయిర్పోర్టుకు సమీపంలోని బిజె మెడికల్ కాలేజీ (బిజెఎంసి) హాస్టల్లో విద్యార్థులు భోజనాలు చేస్తున్నారు.ఈ లోగానే విమానం వీరి హాస్టల్ క్యాంటిన్ వైపు దూసుకువచ్చింది. భీకరమైన శబ్ధం తరువాత క్షణాల్లోనే విమానం మీదపడటంతో విద్యార్థులలో దాదాపు పాతిక మంది మంటలు అంటుకుని మృతి చెందారు. డైనింగ్ టేబుల్ పై ప్లేట్లలో ఆహారం ,వీటిపైనే పడి ఉన్న కాలిన మృతదేహాలతో ఇక్కడ విషాదకర వాతావరణం నెలకొంది. విద్యార్థులలో నలుగురు ఎంబిబిఎస్ చేస్తున్నారు. ఒక్కరు పిజి విద్యార్థి . శిథిలమైన భవనంలో ప్లేట్లలో వడ్డించుకుని ఉన్న అన్నం సగం తినితినకుండా విద్యార్థులు విగత జీవులు అయ్యారు. హాస్టల్ క్యాంటిన్ అంతా చెల్లాచెదరైన ప్లేట్లతో మంచినీటి గ్లాసులతో రణరంగంగా మారింది. విమానంలోని ఓ శకలం హాస్టల్లో ఓ భాగంలో పడి ఉంది. ఈ ఘటనపై ఫైమా డాక్టర్ల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
ఎటువంటి సాయం చేయడానికి అయినా సిద్ధం అని ప్రకటించారు. ఘటనలో 40 మంది వరకూ డాక్టర్లు గాయపడ్డారు. ఒక్క డాక్టరు పరిస్థితి విషమంగా ఉంది. ఘటన సమయంలో తన కుమారుడు హాస్టల్ క్యాంటిన్లో ఉన్నాడని, విమానం కూలుతున్నది గుర్తించి వెంటనే రెండో అంతస్తు నుంచి కిందకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడని విద్యార్థి తల్లి రామ్లీలా తెలిపారు. విమానం దూసుకువస్తున్న వైనం సకాలంలో గుర్తించి చాలా మంది పరుగులు తీయడం , కిందికి దూకడంతో వారి ప్రాణాలు దక్కాయని ఆమె వివరించారు. తన కుమారుడు ఇప్పుడు క్షేమంగా ఉన్నాడని చెప్పింది. ఆయనతో తాను ఫోన్లో మాట్లాడానని వివరించారు. రెండో అంతస్తు నుంచి దూకడంతో గాయాలు అయ్యాయని వివరించారు. కాగా ఘటనలో 30 నుంచి 40 మంది వరకూ జూనియర్ డాక్టర్లు గాయపడ్డారు. వీరిలో ఒక్కరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని ప్రత్యక్ష సాక్షి అయిన డాక్టర్ శ్యామ్ గోవింద్ వార్తా సంస్థలకు తెలిపారు.