మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోమవారం లోకల్ రైళ్ల ప్రయాణికులు నలుగురు దుర్మరణం చెందారు. తొమ్మండుగురు వరకూ గాయాల పాలయ్యారు. రెండు రోజుల సెలవు తరువాత సోమవారం ఉదయం లోకో రైళ్లలో విధులకు చేరుకునే వేలాది మందితో ముంబై, థానే ఇతర ప్రాంతాల రైలు స్టేషన్లు కిటకిటలాడాయి. ముంబ్రా రైల్వే స్టేషన్ వద్ద కిక్కిరిసిన జనంతో వెళ్లుతున్న రైళ్లు మలుపు తిరిగే దశలో ప్యాసింజర్లు జారి పడి పట్టాలపై పడటంతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. చాలా మంది కిందపడటంతో గాయాలయిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే టర్మినస్కు వెళ్లుతున్న ఒక రైలు, కసరా వైపు వెళ్లుతున్న మరో రైలు ప్రయాణికులు గేటు వద్ద నిలబడి ,
ఏచలు పట్టుకుని వెళ్లుతూ ఉండగా అదుపు తప్పి, పట్టాలపై పడిపోవడంతో వారు చనిపోయారు. మృతులలో ఎక్కువ మంది రోజువారి వేతనాలపై వెళ్లేవారు ఉన్నారని వెల్లడైంది. ఏదో విధంగా గమ్యం చేరుకుని , పనులకు వెళ్లాలనే తపనతో కిక్కిరిసిన రైళ్లలోనే వెళ్లాల్సి రావడం ఇప్పటి దుర్ఘటనకు దారితీసింది. జరిగిన ఘటనపై రైల్వేబోర్డు స్పందించింది. సబర్బన్ రైళ్లలో ఇటువంటి ఘటనలు జరగకుండా ఆటోమోటిక్ డోర్స్ ఏర్పాటు చేయాలని ,ఇప్పుడు ఉన్న వాటిని వాటికవే మూసుకునే విధంగా చేయాలని నిర్ణయించారు. ముంబై , శివారు ప్రాంతాల్లో రోజుకూ సగటున 75 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఇప్పటి ఘటనపై ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ విచారం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టారని చెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు.