ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంట్ లేక చీకటి ఆవరించడంతో మొబైల్ ఫోన్లలోని టార్చ్లైట్ వెలుగులో నలుగురు మహిళలకు ప్రసవం జరిగింది. ఆస్పత్రిలో జనరేటర్ ఉన్నప్పటికీ దానిని వినియోగించలేదు. ఈ సంఘటన బయటపడడంతో దర్యాప్తునకు ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లాలో బెరువార్బరి లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సోమవారం రాత్రి ఇది జరిగింది. నిండు గర్భిణులైన నలుగురు మహిళలు మొబైల్ ఫోన్ల వెలుగు లోనే శిశువులకు జన్మనిచ్చారు.
డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. బెరువార్బరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని ట్రాన్స్ఫార్మర్ మూడు రోజుల కిందట కాలిపోయిందని, అయితే ఆరోగ్య కేంద్రంలో జనరేటర్, డీజిల్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఇలా జరిగిందన్నారు. దర్యాప్తు నివేదిక అందిన తరువాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ హామీ ఇచ్చారు.