విద్యార్థుల భవిష్యతే రాష్ట్ర భవిష్యత్తు
విక్టోరియా మెమోరియల్ స్కూల్ కు 5 కోట్లు నిధులు మంజూరు
విక్టోరియా మెమోరియల్ హోమ్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యార్థుల భవిష్యతే రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం భావిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం ఆయన తన పుట్టినరోజు సందర్భంగా కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోమ్లో విద్యార్థులు, అధికారులు, స్థానిక నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. విద్య ద్వారానే మానవ వనరులు మెరుగుపడి తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడుతుందని డిప్యూటీ సీఎం అన్నారు.
ఇంతటి ప్రాధాన్యత ఉన్న విద్యా రంగానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ ప్రపంచంతో పోటీపడేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజక వర్గంలో 25 ఎకరాల్లో 200 కోట్ల పెట్టుబడితో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో మొదటి దశలో 11,600 కోట్లతో 100 పాఠశాలలు నిర్మిస్తున్నామని, విలువైన విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని హామీ ఇచ్చారు. విక్టోరియా మెమోరియల్ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేందుకు వెంటనే ఐదు కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాన్స్కో శాఖలోని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. నిధులు వెంటనే విడుదల చేస్తామని, ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరంవిక్టోరియా మెమోరియల్ స్కూల్లో చదువుకుంటున్న అనాధ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Funds spend on education
Funds spend on education