మన తెలంగాణ / హైదరాబాద్ : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోందని పేర్కాన్నారు.
ఈమేరకు ఆదివారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్ధిక వృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి ప్రతినబూనారు.
కెసిఆర్ శుభాకాంక్షలు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కెసిఆర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. శాతియుతంగా పార్లమెంటరీ పంథాలో కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనలో అభివృద్ది చేసుకున్నామని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ మరింత ప్రగతిని సాధిస్తూ, పాడి పంటలతో వర్థిల్లుతూ, రైతులు, సబ్బండ కులాలు, సకలజనుల జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని కెసిఆర్ ఆకాంక్షించారు.