ఇజ్రాయెల్, ఇరాన్లు వెంటనే యుద్ధం ఆపాలని ఇక్కడ జరుగుతున్న ఏడు దేశాల జి7 శిఖరాగ్ర సదస్సు పిలుపునిచ్చింది. అయితే ఇరాన్ అణు బాంబును సముపార్జించుకోకుండా ఆపాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు సమావేశంలో పాల్గొంటున్న ఏడు దేశాల నేతలు సంతకాలతో ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ‘మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతకు మా కృతనిశ్చయాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. ఈ దృష్టా ఇజ్రాయెల్కు తనను తాను కాపాడుకునే హక్కు ఉంది. ఇజ్రాయెల్ భద్రతకు మా మద్దతును మేము పునరుద్ఘాటిస్తున్నాం.
అలాగే పౌరుల రక్షణకు ప్రాధాన్యతను కూడా మేము నొక్కి చెప్తున్నాం. ప్రాంతీయ అస్థిరతకు, ఉగ్రవాదానికి మూల కారణం ఇరానే. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండరాదని మేము మొదటినుంచీ స్పష్టం చేస్తూనే ఉన్నాం. ఇరాన్ సంక్షోభాన్ని పరిష్కరించడంవల్ల గాజాలో కాల్పుల విరమణతో పాటుగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గడానికి దారితీస్తుంది.అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ఈ ఉద్రిక్తతల ప్రభావంపై మేము అప్రమత్తతో ఉంటాం. అలాగే మార్కెట్ సుస్థిరత కోసం భావసారూప్యం కలిగిన భాగస్వాములతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని ఆ ప్రకటన పేర్కొంది.
కాగా ఇరాన్ ఇజ్రాయెల్లు తక్షణం చర్చలు ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు.జి7 కూటమి సదస్సు సోమవారం ఇక్కడ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు నేతలు విలేకరులతో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నివారించడమే లక్షంగా ఒక పరిష్కారాన్ని కనుగొనాలని తామంతా నిర్ణయానికి వచ్చామని బ్రిటీష్ ప్రధాని కియర్ స్టార్మర్ చెప్పారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలోనూ పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందన్నారు. అణ్వాయుధాలను సొంతం చేసుకోవడానికి ఇరాన్ను అనుమతించకూడదని జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ చెప్పారు.
మరో వైపు జి7 కూటమిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2014లో రష్యాను కూటమినుంచి తొలగించడం పొరపాటేనని చెప్పారు. రష్యాను పక్కన పెట్టడం ఇప్పుడు ప్రపంచాన్ని అస్థిర పరుస్తోందని అభిప్రాయపడ్డారు. జి7 ఇక జి8 కావాలని, జి9 అయితే ఇంకా బాగుంటుందని పేర్కొన్నారు. రష్యా, చైనాలు సైతం కూటమిలో చేరాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రస్తుతం జి7లో ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా, యూరోపియన్ యూనియన్ (ఇయు) సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్ కూటమిలో సభ్య దేశం కానప్పటికీ ఈ ఏడాది కూటమి సదస్సుకు ప్రధాని మోడీని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అర్ధంతరంగా సదస్సునుంచి వెళ్లిపోవడంతో ఆయనతో వాణిజ్య అంశాలపై చర్చలు జరిపే అవకాశాన్ని మోడీ కోల్పోయినట్లు పరిశీలకులు అంటున్నారు. మోడీ మంగళవారం సదస్సునుద్దేశించి ప్రసంగించనున్నారు.