Sunday, June 15, 2025

చిత్ర పరిశ్రమకు..గద్దర్‌కు సంబంధం లేదు

- Advertisement -
- Advertisement -

చిత్ర పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి పేరుతో అవార్డులు అందజేయడం రాష్ట్ర ప్రభుత్వ అవివేకమని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నేత పగుడాకుల బాలస్వామి విమర్శించారు. ఎంతోమంది మహానటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ,దాసరి నారాయణ రావు, రావు గోపాలరావు, సావిత్రి తదితర మహానటులు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేసి తెలుగు ప్రజలను ఒప్పించి, మెప్పించి, నవ్వించి, ఆనందింపజేశారని అన్నారు. వీరంతా జీవితాన్ని ధారపోసి చిత్ర పరిశ్రమకే అంకితం చేశారని అన్నారు.

అలాంటి వారి పేరుతో చిత్ర పరిశ్రమను ప్రోత్సహించే విధంగా అవార్డులు అందజేయడం సముచితంగా ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కానీ రాజకీయ లబ్ధి కోసం సంబంధంలేని ఒక వ్యక్తి పేరుతో బలవంతంగా అవార్డులు అందజేస్తామంటే అది నియంతృత్వానికి పరాకాష్ట మాత్రమేనని ఘాటుగా విమర్శించారు. ఎంతోమంది విద్యార్థులు, దేశభక్తులు, జాతీయవాదులు, పోలీసులను పొట్టన పెట్టుకున్న వ్యక్తి చరిత్ర రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటే మంచిదని గుర్తు చేశారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డు అందజేయడం అంటే, తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రాణం పెట్టి జీవితాలు అర్పించిన మహా మహానటులను అవమానించినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్రపరిశ్రమ పెద్దలెవరూ ప్రశ్నించకపోవడం మరో విచిత్రం
ఈ విషయంలో చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి మెగాస్టార్ నుంచి మొదలుకొని ఎందరో నటీనటులు మాట మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం మరో విచిత్రంగా కనిపిస్తోందని తెలిపారు. మొండిగా వ్యవహరించి నేను చెప్పిందే వేదం, నేను చేసిందే శాసనం అంటూ పాలకులు నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తే సమాజం హర్షించదని పేర్కొన్నారు. నియంతృత్వ ధోరణితో ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో తెలంగాణ రాష్ట్రంలోని గత పాలకులను చూసి నేటి పాలకులు నేర్చుకుంటే అందరికీ మంచిదని హితవు పలికారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆపరేషన్ ఖగార్‌కు వ్యతిరేకంగా గద్దర్ భార్య, గద్దర్ కూతురు పాటలు పాడుతూ మాట్లాడుతుండటం దేశాన్ని ధిక్కరించడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. దేశం పైనే యుద్ధం ప్రకటించే ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తికి చిత్ర పరిశ్రమకు ముడిపెట్టి అవార్డులు అందజేయడం సమంజసం కానే కాదని అన్నారు. గద్దర్‌ను గౌరవించాలంటే వేరే పద్ధతిలో, వేరే మార్గంలో ఆ పని చేసుకోవచ్చునని, కానీ సంబంధంలేని రంగానికి, సంబంధం లేని వ్యక్తిని అంటగట్టడం సరికాదని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News