Wednesday, June 18, 2025

ఉలిక్కిపడ్డ వెలిశాల

- Advertisement -
- Advertisement -

మారేడుమిల్లి ఎన్ కౌంటర్ లో నేలకొరిగిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి
ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రతినిధిగా ఉన్న రవి
శోకసంద్రంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు
కుటుంబమంతా ఉద్యమంతోనే
గాజర్ల రవిపై 25 లక్షల రివార్డ్

మనతెలంగాణ/ వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల ఉలిక్కిపడింది. నాడు విప్లవ ఉద్యమానికి ఊతమిచ్చిన వెలిశాల.. నేడు శోకసంద్రంలో మునిగింది. ఇదే గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతిచెందారు. గాజర్ల రవి (gajarla ravi maoist) మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధు మిత్రులు శోకసంద్రంలో మునిగారు. నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ ఉద్యమంలోకి వెళ్లిన గాజర్ల రవి అంచెలంచెలుగా ఎదిగారు. దళ సభ్యుడి స్థాయి నుంచి కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చల్లో ప్రతినిధిగా ఉన్నారు. గాజర్ల రవిపై 25 లక్షల రివార్డు ఉంది.

కుటుంబమంతా ఉద్యమంతోనే…

పెత్తందార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా తాడిత, పీడిత, బలహీన వర్గాల కోసం పోరుబాట ఎంచుకున్న వారిలో వెలిశాలలోని గాజర్ల కుటుంబం ఒకటి. కుటుంబంలోని అందరు కూడా అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమం వైపు అడుగులు వేశారు. గాజర్ల కుటుంబంలోని నలుగురు సోదరుల్లో ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. పెద్దవాడైన సమ్మయ్య సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ చేసి హన్మకొండలో స్థిరపడ్డారు. ఆయనపై కూడా మావోయిస్ట్ సానుభూతిపరుడిగా ముద్రవేయడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మిగతా ముగ్గురు అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్ళారు. వీరిలో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్.. 35 ఏళ్లకు పైగా మావోయిస్ట్ పార్టీలో పనిచేసి బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. మరో సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు కూడా అజ్ఞాతంలోనే ఉండి అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలో కలిశారు. పోరుబాట వీడి కొంతకాలం పాటు మీడియాలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరకాల నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అజ్ఞాతంలోనే ఉన్న మరొకరే గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్. నాలుగు దశాబ్దాల్లో అంచెలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు.

ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రతినిధిగా….

గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ (gajarla ravi maoist) ఉదయ్ స్వస్థలం భూపాలపల్లి జిల్లా వెలిశాల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2004 అక్టోబర్‌లో జరిపిన శాంతి చర్చల్లో మావోయిస్టు పార్టీ తరపున ప్రతినిధిగా గాజర్ల రవి అలియాస్ గణేశ్ ఉన్నారు. ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి హోదాలో శాంతి చర్చల్లో పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండా‌ను తయారు చేయడం‌లో కామ్రేడ్ గాజర్ల రవి కీలక పాత్ర పోషించారు.

గాజర్ల రవిపై 25 లక్షల రివార్డ్

ఎన్కౌంటర్ లో మృతిచెందిన (gajarla ravi maoist) గాజర్ల రవి అలియాస్ గణేశ్ పై 25 లక్షల రివార్డ్ ఉన్నది. నాలుగు దశాబ్దాల క్రితం మావోయిస్ట్ ఉద్యమంలో దళ సభ్యుడిగా చేరి వెనుదిరిగి చూడలేదు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారు. ఏవోబి, తెలంగాణ – ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతాలపై గట్టి పట్టు ఉన్నది. ఎన్నో దాడుల్లో కీలకంగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News