బర్మింగ్హామ్: టీం ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది. తొలి టెస్ట్లో ఓటమి తర్వాత.. ఈ మ్యాచ్లో సిరీస్ని సమం చేయాలని టీం ఇండియా భావిస్తోంది. అయితే రెండో టెస్ట్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ని (Kuldeep Yadav) జట్టులోకి తీసుకుంటారని అందరూ భావించారు. కానీ, తుది జట్టులో అతనికి చోటు దొరకలేదు. బదులుగా స్పిన్న్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ని జట్టులోకి తీసుకున్నారు. అయితే జట్టులో మార్పుల గురించి చెప్పిన కెప్టెన్ శుభ్మాన్ గిల్.. కుల్దీప్కి తుది జట్టులో ఎందుకు స్థానం కల్పించలేదో వెల్లడించాడు.
తొలి టెస్ట్ మ్యాచ్లో టీం ఇండియా లోయర్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. ఈ నేపథ్యంలోనే కుల్దీప్ని (Kuldeep Yadav) పక్కన పెట్టినట్లు గిల్ తెలిపాడు. ‘‘రెండో టెస్ట్లో జట్టులో మూడు మార్పులు చేశాం. రెడ్డి, వాషిలతో పాటు ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చారు. బుమ్రాకు వర్క్లోడ్ దృష్టిలో పెట్టుకొని ఈ మ్యాచ్లో విశ్రాంతి ఇచ్చాము. లార్డ్స్లో జరిగే మూడో టెస్ట్లో మాకు అతని అవసరం ఉంది. అక్కడి పిచ్ను బుమ్రా సద్వినియోగం చేసుకోగలడు. కుల్దీప్ని తీసుకోవాలని చివరి వరకు అనుకున్నాం. కానీ, బ్యాటింగ్లో డెప్త్ గురించి అతన్ని పక్కనపెట్టాం’’ అని గిల్ స్పష్టం చేశాడు.