టీ20 క్రికెట్ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ క్రమంలో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ సరనసన మ్యాక్సీ చేరాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2025లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో మ్యాక్స్వెల్ వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు తరఫున బరిలో దిగాడు. ఈ మ్యాచ్లో మ్యాక్స్ వెల్ శతకంతో విజృంభించాడు. కేవలం 49 బంతుల్లో 2 ఫోర్లు, 13 సిక్సర్లతో 216.33 స్ట్రైక్ రేట్ తో అజేయంగా 106 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్ లో తనకు ఇది ఎనిమిదో సెంచరీ. దీంతో టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో క్రికెటర్ గా మ్యాక్స్ వెల్ నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, జోస్ బట్లర్, అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ సరసన మ్యాక్సీ నిలిచాడు. వార్నర్, ఫించ్, రోహిత్, బట్లర్, మైఖేల్ క్లింగర్ కూడా ఎనిమిది T20 సెంచరీలు సాధించారు. కాగా, ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు వెస్టిండీస్ ఐకాన్ క్రిస్ గేల్ తొలి స్థానంలో ఉన్నాడు. గేల్ మొత్తం 463 మ్యాచ్ల్లో 22 సెంచరీలు చేశాడు. తర్వాత పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజం (11), దక్షిణాఫ్రికాకు చెందిన రిలీ రోసౌ(9), భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (9) ఉన్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. మ్యాక్స్వెల్ తోపాటు మిచెల్ ఓవెన్ 11 బంతుల్లో 32 పరుగులతో చెలరేగడంతో లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్ పై వాషింగ్టన్ ఫ్రీడమ్ 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, గత సంవత్సరం జట్టుకు నాయకత్వం వహించిన స్టీవ్ స్మిత్ లేకపోవడంతో.. అతని స్థానంలో కెప్టెన్ గా గ్లెన్ మ్యాక్స్వెల్ బాధ్యతలు చేపట్టాడు. అతని కెప్టెన్సీలో జట్టు ఇప్పటివరకు ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయింది.