కాళేశ్వరం అనుబంధ లింక్-2 పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి బుధవారం ఉదయం నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తోడు మంగళవారం సాయంత్రం కడెం ప్రాజెక్టు నుంచి 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.8016 టీఎంసీల సామర్ధ్యానికి చేరింది. ఈ క్రమంలో మరింత నీటి ప్రవాహం ప్రాజెక్టులోకి చేరనున్న నేపథ్యంలో ముందస్తుగా అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోవాలని నిర్ణయించారు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్లో ఉదయం 6:30 గంటల సమయంలో 2 మోటార్లను,
ఆ తరువాత అరగంట వ్యవధిలో 3వ మోటార్ను ఆన్ చేశారు. దీంతో 9,450 క్యూసెక్కుల చొప్పున నీరు డెలివరీ సిస్టర్న్ల ద్వారా గోదావరి జలాలు ఎగిసిపడుతూ నంది రిజర్వాయర్లోకి పంపింగ్ అవుతూ అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్కు నంది రిజర్వాయర్ నుంచి జంట సొరంగాల ద్వారా నీరు సరఫరా అవుతుంది. అక్కడి పంప్ హౌస్లో 3 మోటార్లను ఆన్ చేసి అదే పరిమాణంలో మిడ్ మానేరులోకి నీటి సరఫరా అవుతున్నట్లు ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. కాగా వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు నంది పంపు హౌస్ ద్వారా ప్రక్రియ మొదలు కావడం ఇదే మొదటిసారి.