టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్.1 (Production No.1) గా కుంచం శంకర్ దర్శకత్వంలో తలారి దినకరణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం నాడు ఘనంగా జరిగాయి. ముహుర్తపు సన్నివేశానికి రామ్ అబ్బరాజు క్లాప్ నివ్వగా, ప్రశాంత్ కుమార్ దిమ్మెల కెమెరా స్విచాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ అబ్బరాజు, ప్రశాంత్ దిమ్మెల, అడిదాల విజయ్పాల్ రెడ్డి స్క్రిప్ట్ అందించారు. పవన్ కేసరి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించనున్నారు.
ఇక ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా హీరో పవన్ కేసరి మాట్లాడుతూ “నా బాల్య స్నేహితుడు సన్నీ స్థాపించిన ఈ బ్యానర్ మీద సినిమా (Film banner) చేస్తుండటం ఆనందంగా ఉంది. విజయ్ మంచి సంగీతాన్ని ఇవ్వబోతోన్నారు”అని అన్నారు. తలారి హేమావతి రెడ్డి మాట్లాడుతూ “పవన్, కావ్యతో పని చేస్తుండటం ఆనందంగా ఉంది. శంకర్ ఓ మంచి కథతో రాబోతోన్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్, డైరెక్టర్ కుంచం శంకర్, విజయ్ బుల్గానిన్ తదితరులు పాల్గొన్నారు.