విధాన సౌధలో బెంగళూరు జట్టుకు సత్కారం
కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక సిఎం, డిప్యూటీ సిఎంలు
బెంగళూరు: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలి ఐపిఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్కు బుధవారం కర్ణాటక ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. కర్ణాటక విధాన సౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఆర్సిబి క్రికెటర్లను ఘనంగా సన్మానించారు. కోట్లాది మంది అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఐపిఎల్ ట్రోఫీని సాధించిన టీమ్ను వీరు అభినందించారు.
ఆర్సిబి విజయం రాష్ట్రం మొత్తానికే గర్వకారణమని సిఎం, డిప్యూటీ సిఎంలు పేర్కొన్నారు. అసాధారణ ఆటతో జట్టుకు ట్రోఫీని సాధించి పెట్టిన స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై వీరు ప్రశంసల వర్షం కురిపించారు. జట్టు విజయంలో తమవంతు సహకారం అందించిన ప్రతి ఆటగాడిని వారు పొగడ్తలతో ముంచెత్తారు.
అంతకుముందు ఆర్సిబి ఐపిఎల్ ట్రోఫీ సాధించి తొలిసారి బెంగళూరుకు చేరుకోగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థానిక విమానాశ్రయంలో టీమ్కు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి జట్టుతో కలిసి ఆయన ఓపెన్ టాప్ వాహనంలో విధాన సౌధకు చేరుకున్నారు. దారి పొడుగున జట్టుకు అభిమానులు నీరాజనం పలికారు.