థియేటర్స్ పర్సంటేజ్ విధానంపై చర్చ నడుస్తోందని సీనియర్ నటుడు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి (R.Narayana Murthy) తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాకు ముందు థియేటర్ల బంద్పై కుట్ర ఉందని.. దాన్ని వెనుక ఎవరున్నారో కనిపెట్టాలని ఎపి మంత్రి కందుల దుర్గేష్ అనటం సరైనది కాదన్నారు. చిత్ర పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాలపై ఆర్.నారాయణ మూర్తి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గద్దర్ అవార్డులను(Gaddar Awards) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం గర్వంగా ఉంది. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమను గౌరవించారు. విజేతలకు నా అభినందనలు. ఎపిలో సిఎం చంద్రబాబు కూడా నంది అవార్డులను ప్రకటించాలని కోరుకుంటున్నాను. ఇక ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఎపి డిప్యూటీ సిఎం పవన్కళ్యాణ్ అనడంలో తప్పులేదు.
ప్రభుత్వం తండ్రిలాంటిదని, వారు కూడా సమస్యలపై చర్చిండానికి సినీ పరిశ్రను మరోసారి పిలిస్తే బాగుండేది. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధం. పర్సంటేజ్లు ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుంది. పర్సంటేజ్ విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో ‘హరిహర వీరమల్లు’కు లింక్ పెట్టడం సరికాదు. ఇక పవన్ కళ్యాణ్పై ఎవరు కుట్ర చేస్తారు. పవన్పై కుట్ర చేసే దమ్ము ఎవరికీ దమ్ము లేదు. హరిహర వీరమల్లు కోసం కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్పై గౌరవం మరింత పెరిగేది. బంద్ అనేది బ్రహ్మాస్త్రం. ప్రస్తుతం సింగిల్స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరమైంది. పర్సంటేజ్ విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేనూ ఒకడిని. కార్పొరేట్ సిస్టమ్లకు వంత పాడుతున్నారు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి? పర్సంటేజ్ను బతికించి నిర్మాతలను కాపాడాలి”అని అన్నారు.