రాజధానిలో మంగళవారం ఉదయం చందానగర్లోని ఖజానా జూవెల్లర్స్లో జరిగిన దోపిడీ పెను సంచలనం సృష్టించింది. గన్స్తో జూవెల్లరీ షాపులోకి చొరబడిన ఆరుగురు నిందితులు సిసి కెమెరాలను ధ్వంసం చేసి, సిబ్బందిపై కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్, ముంబాయి జాతీర రహదారి 65పై ఉన్న ఖజానీ జూవెల్లరీ షాపులోకి ఉదయం 10.35గంటలకు ప్రవేశించిన నిందితులు వెండి వస్తువులు ఎత్తుకుని వెళ్లారు. బంగారు ఆభరణాలు ఎత్తుకుని వెళ్లేందుకు యత్నించినా లాకర్ తాళం చెవి సిబ్బంది ఇవ్వకపోవడంతో భారీ దోపిడీ తప్పింది. హైదరాబాద్ ముంబై జాతీయ రహదారి పక్కన ఉన్న ఖజానా జ్యువెలరీ షాప్ను సిబ్బంది మంగళవారం ఉదయం 10.30 గంటలకు తెరిచారు. షోరూం తెరిచిన ఐదు నిమిషాల్లోను ఓ నిందితుడు లోపలికి వచ్చి రెక్కీ నిర్వహించి బయటికి వెళ్లిపోయాడు. తర్వాత ఆరుగురు ముఠా సభ్యులు చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ పెట్టుకుని గన్స్తో షోరూం లోపలికి 10.35 గంటలకు వచ్చారు, వచ్చి రావడంతోనే సిబ్బందిని తుపాకులతో బెదిరించారు.
బంగారు ఆభరణాలు ఉన్న లాకర్ తాళంచెవి ఇవ్వమని అసిస్టెంట్ మేనేజర్ సతీష్ను నిందితులు బెదిరించారు, ఇచ్చేందుకు సతీష్ నిరాకరించడంతో కాలిపై కాల్చారు. తర్వాత షోరూం రూఫ్పైకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దీంతో సిబ్బంది ఒక్కసారిగా ఆందోళన చెంది అక్కడి నుంచి పరుగు పెట్టారు. మేనేజర్ వద్ద లాకర్ కీ ఒకటి, అసిస్టెంట్ మేనేజర్ వద్ద ఒక లాకర్ కీ ఉంటుంది. మేనేజర్ మంగళవారం విధులకు రాకపోవడంతో లాకర్ను ఓపెన్ చేయడం సాధ్యం కాలేదు. బంగారు ఆభరణాల లాకర్ను ఓపెన్ చేయకపోవడంతో నిందితులు షాపులో ఉన్న వెండి వస్తువులు ఉన్న గ్లాస్లను పగులగొట్టి ఎత్తుకుని వెళ్లారు. దోపిడీకి వచ్చిన నిందితులు షోరూంలో పది నిమిషాలు మాత్రమే ఉన్నారు. తర్వాత మూడు బైక్లపై సంగారెడ్డి,జహీరాబాద్ వైపు నిందితులు పారిపోయారు. ఎంత విలువైన వెండి వస్తువులు దోపిడీ చేసింది తెలియరాలేదు. సంఘటన స్థలానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి చేరుకున్నారు. దోపిడీ జరిగిన తీరును షోరూం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు పదిబృందాలను ఏర్పాటు చేశామని, సిసిఎస్, ఎస్ఓటి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు. నిందితుల వద్ద మూడు గన్స్ ఉన్నట్లు సిబ్బంది చెప్పారని తెలిపారు.