రాష్ట్రంలో రాజకీయ నాయకులు వాడే భాష చాలా బాధాకరమని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష, అధికార పక్షాలు తప్పుడు భాషను వాడి ప్రజల ఈసడింపులకు గురికావొద్దంటూ హితవు పలికారు. రాజ్యాంగ పదవులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. ఎన్నికలలో వేల కోట్లలో డబ్బులు ఖర్చుపెడుతున్నారని, దాంతో అన్ని రాష్ట్రాల రాజకీయాల్లో అవినీతి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం, సు ప్రీం కోర్టు, కేంద్రం అవినీతిపై దృష్టి సారించాలని, ఎన్నికల్లో ఖర్చు చేసి విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని అప్పీల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలు కూడా నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఇతర రాష్ట్రాల వ్యక్తులు అన్ని పనులలో ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
వ్యవసాయ కూలీలు కూడా బీహార్ లాంటి రాష్ట్రాల నుండి వస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వైపు పథకాల కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి ఉండొద్దని పేర్కొన్నారు. ఉచితాలు తగ్గించి ప్రజలకు ఉపాధి కల్పించాలని హితవు పలికారు. రాజకీయ పార్టీల వైఖరితో అధికారుల్లో అవినీతి పెరిగిందని ఆరో పించారు. జయలలిత, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు తమ వెంట ఏమీ తీసుకుపోలేదని వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు ముందుగానే నీటిని విడుదల చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఉత్త మ్ కుమార్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్రాస్కు నీళ్లు తీసుకుపోవడానికి ప్రాజెక్ట్ల అనుసంధానం జరిగిందన్నారు. ఇచ్చంపల్లి నుండి నాగార్జున సాగర్కు నీళ్లు వస్తే తెలంగాణకు మేలు జరుగుతుందని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ను తెలంగాణ గట్టిగా వ్యతిరేకిస్తుందని, బనకచర్ల ద్వారా తెలంగాణకి నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవిత నుంచి తనకు ఫిర్యాదులు అందాయని, అయితే ఆ ఇద్దరు ఎంఎల్సిల వ్యవహారం తనకు బాధను కలిగించిందని గుర్తు చేశారు. చట్టపరంగా తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తానని స్పష్టం చేశారు.