Friday, June 13, 2025

చెత్త తరలించే ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేని స్థితికి రేవంత్ సర్కార్: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో చెత్త తరలించే ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేని దిక్కుమాలిన స్థితికి సిఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని దిగజార్చారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు విమర్శించారు. పెట్రోల్ పంపు వాళ్ళు డీజిల్ ఉద్దెరకు పోయడం లేదని, అప్పు పుడుతలేదని, సెక్రటరీలు ట్రాక్టర్ తాళాలను అధికారులకు అప్పగించే పరిస్థితికి తెచ్చారని మండిపడ్డారు. ఏడాదిన్నరగా నిధులు ఇవ్వకుంటే గ్రామ పాలన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి చేతగానితనం పంచాయతీ అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బందికి శాపంగా మారుతున్నదని అన్నారు. కెసిఆర్ గ్రామ పంచాయతీలను దేశం గర్వించే దిశగా తీర్చిదిద్దితే, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల పంచాయతీలు కునారిల్లుతున్నాయని పేర్కొన్నారు. పంచాయతీల సంఖ్యను 12,941కి చేర్చి, ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను కెసిఆర్ నిలిపారని తెలిపారు. నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటుపడిందని,

నెల నెలా నిధులు విడుదల చేయకుండా నిర్వహణను గాలికి వదిలి వేయడంతో గ్రామాలు మురికి కూపాలుగా మారాయని ఆరోపించారు. చివరకు ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొందని, కొన్ని చోట్ల అధికారులు మూలకు పెట్టగా, మరికొన్ని చోట్ల వారం, మూడు రోజులకు ఒకసారి నడుపుతున్నారని, అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. సొంత జేబు నుంచి డబ్బులు ఖర్చు చెయ్యలేక, ఆ ఆర్థిక భారాన్ని మోయలేక పంచాయతీ కార్యార్శులు మూకుమ్మడిగా సెలవులు పెట్టే దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన గాలికి వదిలేసి ముగ్గురు మంత్రులకు పోర్టు ఫోలియోలు కేటాయించేందుకు మూడురోజులుగా సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో తీష్ట వేశారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే నిధులు విడుదల చేయాలని, పాడై పోతున్న గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలని బిఆర్‌ఎస్ పార్టీ పక్షాన హరీష్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News