హైదరాబాద్: మేడిగడ్డకు మోటర్లను ఆన్ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ( Harish Rao) మండిపడ్డారు. బిఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు ప్రతిరోజూ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ నేతలపై కోపంతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. నీటి విలువ తెలియని వాళ్లు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ నుంచి 73,600 క్యూసెక్కులు నీటి ప్రవాహం ఉందని తెలిపారు. నీటిని తీసుకునే అవకాశం ఉన్నా, ఎందుకు తీసుకోవట్లేదు? అని నీటిని ఎత్తిపోసేందుకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోటార్లు ఆన్ చేస్తే 15 జిల్లాలకు సాగునీరు అందుతుందని, ఎస్ఆర్ఎస్ కింద పంటలు వేయాలో వద్దో అని రైతులు ఆలోచిస్తున్నారని తెలియజేశారు. నాయకత్వంలో రైతులందరితో కలిసి కన్నెపల్లికి వెళ్లి మోటార్లు ఆన్ చేస్తామని, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి సాగునీరు (Turn motors irrigate) అందించాలని అన్నారు. 20 జిల్లాల రైతులతో కదిలి మోటార్లు ఆన్ చేసి సాగునీరు అందిస్తామని హెచ్చరించారు. మేడిగడ్డకు మరమ్మతు చేయాలంటే ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్ డిఎస్ఎ నివేదిక చూపి మేడిగడ్డ మరమ్మతును ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, పోలవరంలో డయాఫ్రం వాల్ కోట్టుకుపోతే అక్కడికి ఎన్ డిఎస్ఏ ఎందుకు పోలేదని నిలదీశారు. ఎస్ఎల్ బిసి టన్నెల్ కుప్పకూలిపోతే ఎన్ డిఎస్ఎ ఎందుకు రాలేదు? అని హరీష్ రావు అన్నారు.