హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ ప్రజలపై పన్నుల భారం దించితే.. సిఎం రేవంత్ రెడ్డి పెంచుతున్నారని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తెలిపారు. రెండేళ్ల రేవంత్ పాలనలో ప్రజలపై అప్పులు, పన్నుల భారం మోపారని అన్నారు. సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయం లో హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల పై పన్నుల భారం పై హరీష్ రావు మండిపడ్డారు. ప్రజలపై పన్నులు వేయడం లేదని శాసనసభలో చెబుతున్నారని, అసలే ఆర్థిక మాంద్యం.. వరసగా రెండో నెల డిఫ్లేషన్ లో ఉందని తెలియజేశారు. తెలంగాణలో వరసగా ఇది రెండో సారి అని విమర్శించారు. పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయ్యిందని, రోజుకో పన్ను వేస్తూ ప్రజలకు షాక్ ఇస్తుందని మండిపడ్డారు.
రెండు నెలల నుంచి ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో రెండు వేల కోట్ల భారం పడిందని, గతంలో 100 సర్వీస్ టాక్స్ ను 200 లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెహికిల్ సర్వీస్ టాక్స్ (Vehicle Service Tax) 400 నుంచి వన్ పర్సంటేజ్ కు పెంచారని, రోడ్ టాక్స్, మోటార్ సైకిల్ టాక్స్ ను నాలుగైదు వేలకు పెంచారని అన్నారు. రెండు నెలల నుంచి పెనాల్టీల రూపంలో రెండు వేల కోట్ల భారం మోపారని ధ్వజమెత్తారు. గతంలో 7100 కోట్లు టాక్స్ వసూలు అయితే.. ఈ ఏడాది 6900 కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, బడ్జెట్ 8000 కోట్లు అంచనా వేశారని, ఇదేలా సాధ్యం అని హరీశ్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీ లో సుద్దపూస మాటలు మాట్లాడారని, వాస్తవంలో అన్ని పన్నుల పెంపు విధించారని చురకలంటించారు. పదేళ్ల బిఆర్ ఎస్ ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ లో టాక్స్ లు రద్దు చేశామని, పేదలకు సాయం చేశామని గుర్తు చేశారు. పేదలపై ఈ పన్నుల భారాన్ని ఈ ప్రభుత్వం తొలగించాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తాము పన్నులు తొలగిస్తే.. తమరు పన్నులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా మార్పు అని నిలదీశారు. ఆర్ అండ్ బి, పిఆర్ లో అన్యూటి మోడల్ లో రోడ్లు వేయాలని కుట్రలు చేస్తున్నారని, ప్రజలపై దొడ్డి దారిన భారం వేసి ఆ అప్పులు కడుతున్నాని, దీన్ని ఉపసంహరించుకోవాలని హరీశ్ రావు హెచ్చరించారు. పండగలు వస్తే పాపం.. పండగకు ముందు వారం, పండగ తరువాత వారం ఆర్టీసీ ఛార్జీలు డబుల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పంచడం బందు చేసి, పెంచడం షూరు చేసిందని, మద్యం ధరలు రెండు సార్లు పెంచారని చెప్పారు. ప్రతి గ్రామానికి మద్యం షాపులు తెరుస్తున్నారని, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా రేపో మాపో పెంచుతారని జోస్యం చెప్పారు. పేద ప్రజల రక్తమాంసాలు పీలుస్తారా అని ఢిల్లీకి డబ్బుల సంచులు మోయడం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తమ ఆర్ఆర్ టాక్స్ వల్ల రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గిందని హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.