Monday, May 5, 2025

అగమ్యగోచరంగా 6లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు

- Advertisement -
- Advertisement -

డిగ్రీ కాలేజీలకు రూ.800 కోట్ల
ఫీజు రీయింబర్స్‌మెంట్ బాకీలు
రూ.5లక్షల విద్యాభరోసా
కార్డుకు అతీగతీలేదు కాంగ్రెస్‌పై
బిఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజం

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి విద్యార్థుల చదువును, జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ కళాశాలలకు దాదాపు రూ. 800 కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచడంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. సకాలంలో పరీక్ష నిర్వహించకపోవడంతో పిజిసెట్, లాసెట్, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి మూడో సంవత్సరం విద్యార్థులు అర్హత కోల్పోతున్నారని చెప్పారు.

ఏప్రిల్ నెలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికీ నిర్వహించకపోవడం ప్రభుత్వ చేతగానితనమే అని విమర్శించారు. మరోవైపు ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు డిగ్రీ పరీక్షలు నిర్వహించకుండా నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, కళాశాల యాజమాన్యాలు అప్పులు తెచ్చి బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న పరిస్థితి అని పేర్కొన్నారు. అద్దెలు, అప్పులు పెరిగిపోవడంతో ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లను నిలిపివేయగా, కొన్నిచోట్ల కళాశాలలకు తాళం వేసి ఇప్పటికే సెలవులు ప్రకటించారని అన్నారు.

ఇంత జరుగుతుంటే తమకేమీ పట్టనట్లు సిఎం, మంత్రులు వ్యవహరిస్తుండడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దివంగత సిఎం వైఎస్ ప్రారంభించిన పథకాన్ని ఎలాంటి మార్పు లేకుండా కెసిఆర్ అమలు చేసి గొప్ప మనసు చాటుకున్నారని గుర్తు చేశారు. కరోనా వంటి ఆర్థిక సంక్షోభ కాలం సహా, ఏనాడు ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు ఆపలేదని తెలిపారు. ప్రతి ఏటా సగటున రెండు వేల కోట్లు, తొమ్మిదిన్నరేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో మొత్తం 19,000 కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేశామని చెప్పారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 17 నెలల్లో 17 పైసలు కూడా ఫీజు రియంబర్స్‌మెంట్ కింద విడుదల చేయలేదని పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో విద్య అనేది మిథ్య అని స్పష్టమవుతున్నదని వ్యాఖ్యానించారు.

రేవంత్‌రెడ్డి మాటలు గాలి మాటలే అయ్యాయి

యువ వికాసం పేరుతో ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో పెట్టారని, దానికి అతి గతి లేదని హరీష్‌రావు మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తామని మేనిఫెస్టోలో చెప్పి, పథకాన్ని మరుగున పడేలా చేశారని విమర్శించారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు గాలి మాటలే అయ్యాయని ఆరోపించారు. రెండు నెలల్లో మొత్తం బకాయిలు క్లియర్ చేస్తామని, కళాశాల యాజమాన్యాలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నీటి మూటలే అయ్యాయని అన్నారు. మాటమీద నిలబడేది లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చేది లేదు అని, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరిదీ అదే దారి అని పేర్కొన్నారు.

‘విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడం ఈ రేవంత్ అన్న బాధ్యత’ అంటూ స్పీచ్‌లు దంచే సిఎం ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు..? అని ప్రశ్నించారు. విద్యార్థుల పరీక్ష ఫీజులు కూడా చెల్లించని దారుణమైన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా..? అని అడిగారు. 17 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమ హాస్టళ్లకు తాళాలు పడ్డాయి.. డిగ్రీ కళాశాలలకు తాళాలు పడ్డాయి..మెడికల్ కాలేజీలకు తాళాలు పడ్డాయి అని ఆవేదన వ్యక్తం చేశారుర. ఇక గురుకులాలది దీన గాథ అని పేర్కొన్నారు. ఏడాదిన్నర పాలనలో విద్యావ్యవస్థలో తెచ్చిన కాంగ్రెస్ మార్కు మార్పు ఇది అని విమర్శించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. తక్షణం డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థుల జీవితాలు అంధకారం కాకుండా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్‌రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News