కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టారీతిగా మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్లుందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు మండిపడ్డారు. చెప్పిన అబద్దాన్నే మళ్లీ మళ్లీ చెబితే ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఉత్తమ్ ఉండటం దౌర్భాగ్యం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడమే రేవంత్, ఉత్తమ్లకు సింగిల్ పాయింట్ ఎజెండాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లను, పంప్ హౌజ్లను వాడుకుంటూనే మరోవైపు అది వైట్ ఎలిఫెంట్ అనడం ఏంటనీ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని నిలదీశారు. రేవంత్, ఉత్తమ్లే తెలంగాణ పాలిట వైట్ ఎలిఫెంట్లు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఒకరు రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు.. మరొకరు నీటి వాటాకు గండి కొడుతున్నారని ఆరోపించారు. ఏడాదిన్నర నుంచి కాళేశ్వరం మీద కుట్రలు చేయడం తప్ప, ఎక్కడా ఒక ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు..ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదని మండిపడ్డారు.తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడం కమిషన్ల కోసమే అని అదే పనిగా కారు కూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎప్పుడు, ఎక్కడ వాస్తవాలు చెప్పడానికైనా తాము సిద్దం అని స్పష్టం చేశారు. విచారణ తర్వాత చర్యలు తప్పవని మంత్రి ముందే ఎలా ప్రకటిస్తున్నారని, మంత్రి మనసులో ఉన్న కుట్రకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని ప్రశ్నించారు.