Friday, June 6, 2025

బడా పారిశ్రామిక వేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెడుతున్న సిఎం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

తనకు నచ్చిన బడాబాబుల కోసం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ భూములను బలవంతంగా సేకరించే భాద్యతను సిఎం భుజాన వేసుకోవడంతో రైతులపై తరచుగా ప్రైవేటు వ్యక్తులు, పోలీసులు లాఠీలు ప్రయోగిస్తున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్సర్లతో పాటు పోలీసులు కూడా రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషం అని పేర్కొన్నారు. పాలమూరు బిడ్డను అని పదేపదే చెప్పుకునే రేవంత్ రెడ్డి తన జిల్లాలోనే ఘటన జరిగి 24 గంటలు అవుతున్నా స్పందించరా..? అని ప్రశ్నించారు. పోలీసులు 12 గ్రామాల రైతులను కొట్టి, 40 మందిపై కేసులు పెట్టి, 12 మంది రిమాండ్‌కి పంపించడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కొట్టించిన ఇథనాల్ ఫ్యాక్టరీ యజమానిపై కానీ, బౌన్సర్లపై కానీ ఎందుకు కేసులు పెటలేదో చెప్పాలని రేవంత్ సర్కారుని ప్రశ్నిస్తున్నానని అన్నారు.

కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగాయని మండిపడ్డారు. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన లంబాడా రైతులకు బేడీలు వేసిన ఘటనపై కేంద్ర మానవ హక్కుల సంఘం, ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ తప్పుపట్టినా బుద్ధి రాలేదని చెప్పారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్‌లో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన రైతులను కొట్టారు… రియల్ ఎస్టేట్ దందాలు పెంచుకోవడానికి 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ విషయంలో కూడా రైతులపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఫార్మా సిటీ భూములు తిరిగిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చి తిరిగి అదే రైతులపై కేసులు పెట్టారని చెప్పారు. జహీరాబాద్ న్యాలకల్ రైతులపై విచక్షణారహితంగా దాడి చేసి అక్రమ కేసులు పెట్టించారని, సూర్యాపేట జిల్లా చిలకలూరు గ్రామం రైతులు రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే 42 మందిపై కేసులు పెట్టి పోలీస్ జులుం చూపించారని, ధాన్యం కోతలను ప్రశ్నించినందుకు నిర్మల్ జిల్లా ఏర్వచింతలో రైతులపై కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకా ఎన్ని రకాలుగా రైతులను గోసపెడుతావ్ అంటూ సిఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. రైతులకు, ప్రజలకు పనికి వచ్చే ఒక్క పని చేయడం లేదు కానీ, పెద్దలకు మాత్రం భూములను కట్టబెడుతున్నారని ఆరోపించారు. రైతులను కొట్టు కమిషన్లు పట్టు అనే విధంగా సాగుతుంది రేవంత్‌రెడ్డి పాలన అని విమర్శించారు. తెలంగాణ రైతు లోకం తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేసిన పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన 12 మంది రైతులను వెంటనే విడుదల చేయాలని హరీష్‌రావు బిఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News