Monday, June 23, 2025

ఎక్కడికక్కడే నిలిచిపోయిన గ్రామ పంచాయతీల అభివృద్ది

- Advertisement -
- Advertisement -

నిధులు విడుదల లేకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ది ఎక్కడికక్కడే నిలిచిపోయిందని, గ్రామాల్లో పారిశుద్ద్యం పడకేసిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు పేర్కొన్నారు. గ్రామాల్లో కుంటుపడిన పారిశుద్ద్యం, మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, పంచాయతీ నిధుల విడుదల, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ, ఇతర సమస్యల గురించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)కు మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం లేఖ లేఖ రాశారు. గ్రామాలలో వీధి దీపాల నిర్వహణ లేక పల్లెలు అంధకారంలో ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేక, ఆర్‌టిఎ టాక్స్ కట్టలేక అధికారులకు తాళాలు అప్పగిస్తున్న దుస్థితి వచ్చిందని అన్నారు.

గ్రామాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా 2019లో కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామ పంచాయతీల అభివృద్ది కోసం వారు ఎంతో శ్రమించారని చెప్పారు. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు మంజూరు చేయడం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ అధికారుల కృషి వల్ల తెలంగాణ గ్రామాలు అభివృద్దిలో దేశానికే ఆదర్శంగా నిలిచాయని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినప్పటికీ, పంచాయతీ అధికారులు అప్పులు తెచ్చి మరీ నిర్వహణ కొనసాగించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఒకవైపు రోజురోజుకీ అప్పులు పెరగటం, మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం మరింత పెరిగిందని,

దీంతో వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తే నిధులు విడుదల మరింత కష్టతరం అవుతుందని బాధపడుతున్నారని తెలిపారు. అదే విధంగా మాజీ సర్పంచులు సైతం చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులు, చేసిన పనులకు గాను మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల డిమాండ్ చేశారు. అలాగే అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలని, వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో స్పెషల్ డ్రైవులు నిర్వహించి, పారిశుద్ద్యం పెంపొందించాలని అన్నారు. గత మూడు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,

వెంటనే వారికి వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం శోచనీయం అని, వెంటనే వారి వేతనాలు విడుదల చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News