నాడైనా నేడైనా తెలంగాణ ప్రయోజనాల ముందు పదవులు బిఆర్ఎస్కు తృణప్రాయం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు పేర్కొన్నారు. బనకచర్లతో ఎపి అప్పనంగా నీళ్ళు దోచుకుపోతా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల వంటి ఎపి అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 20 ఏళ్ల క్రితం ఇదే రోజున (జులై 4, 2005) మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని గుర్తు చేశారు. కెసిఆర్ ఆదేశానుసారం.. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ నీటి హక్కుల కోసం పదవులను గడ్డి పోచలుగా భావించి వదులుకున్నామని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కొట్లాడి
సాధించుకున్న తెలంగాణలో.. ఆంధ్రప్రదేశ్ బనకచర్ల పేరిట గోదావరి నీళ్ల దోపిడి చేస్తానంటే చూస్తూ ఊరుకుంటామా..? అని ప్రశ్నించారు. నాడైనా, నేడైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే ఏ కుట్రలనైనా బిఆర్ఎస్ పార్టీ సహించదు అని పేర్కొన్నారు. పదవులకు రాజీనామాలు చేయడం మాత్రమే కాదు, పేగులు తెగేదాకా కొట్లాడుతామని, తెలంగాణకు అన్యాయం జరగకుండా కాపలా ఉంటాం.. కంటికి రెప్పలా ఉండి కాపాడుకుంటామని తెలిపారు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతాం..ప్రాంతంవాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం..జై తెలంగాణ.. జై కెసిఆర్ అంటూ ట్వీట్ చేశారు.