Friday, June 6, 2025

రాజన్న సన్నిధిలో కోడెలు మృతి రాష్ట్రానికి అరిష్టం: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థత పాలన వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రాజన్న ఆలయంలో వారం రోజుల్లో 26 కోడెలు మృతి చెందడం రాష్ట్రానికి అరిష్టమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా, నర్సాపూర్‌కు బుధవారం వచ్చిన సందర్భంగా స్థానిక ఎంఎల్‌ఎ సునీతారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు సమర్పించుకున్న కోడెలకు పశుగ్రాసం సక్రమంగా లేక వారం రోజుల్లో 26 కోడెలు మృతి చెందాయని, హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక వైద్యాలయంలో రోగులకు తిండి పెట్టే స్థితిలో ప్రభుత్వం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి రాజన్న కోడెలను పోషించడం చేతకాకపోతే బిఆర్‌ఎస్ నాయకులకు దత్తత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలన 500 రోజులు కావసున్నా ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ్ద రైతులపై లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ ఎకరం భూమి రైతులకు రావాల్సిన మూడు పర్యాయాల రైతుబంధు రూ.18 వేలు బాకీపడ్డారని అన్నారు.

కేబినెట్ సమావేశంలో చర్చించి రైతులకు రావాల్సిన రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రశ్నించే బిఆర్‌ఎస్ నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించడం తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు చేయడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన ఆగమాగం.. జగన్నాటకంగా ఉందని వ్యాఖ్యానించారు. సన్నరకం వడ్లకు బోనస్‌గా రూ.1,100 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదని, వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలు మళ్లీ కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. పండించిన వరి ధాన్యం వర్షానికి తడిసి కొనుగోలు కాలేక వరికుప్పలపైన రైతులు మృతి చెందుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన రైతు బీమా పథకాన్ని సర్కార్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఇవ్వడంలో విఫలమైన ప్రభుత్వం గొప్పలు చెప్పుకొని ప్రజలను మోసం చేయాలని చూస్తే ఊరుకోరని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఉమ్మన్నగారి దేవేందర్‌రెడ్డి, చంద్రాగౌడ్, అశోక్‌గౌడ్, చంద్రశేఖర్, కంబాల బిక్షపతి, సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News