Sunday, June 8, 2025

కుంగితే కూలినట్లా?

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం వల్లనే యాసంగిలో పంటలు
పండాయి దానివల్లే రాష్ట్రంలో
సాగు విస్తీర్ణం 2.20కోట్ల ఎకరాలకు
చేరింది తమ్మిడిహట్టి వద్ద నీటి
లభ్యత లేకపోవడం, మహారాష్ట్ర
ఒప్పుకోనందువల్లే మేడిగడ్డకు మార్పు
ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని ఎంపిక
చేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థ
వ్యాస్కోపే భూసేకరణ పరిహారం
పెంచడం వల్లే ప్రాజెక్టు అంచనా
వ్యయం పెరిగింది బిజెపి జేబు సంస్థలా
ఎన్‌డిఎస్‌ఎ ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డ
వాళ్లం.. కమిషన్లకు భయపడతామా?
కాళేశ్వరంపై బిఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు వ్యాఖ్యానించారు. తమ రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. కానీ కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రయోజనాల కంటే..రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. కాళేశ్వరం కూ లిందంటూ కాంగ్రెస్ దుష్ప్రచార చే స్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ నో టీసులు, ప్రాజెక్టులపై విపక్షాల విమర్శల నేపథ్యంలో మాజీ నీటి పారుదల శాఖ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు తెలంగాణ భవన్‌లో శనివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కి.మీ. సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్.. 141 టిఎంసిల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తు ఎత్తిపోతలు అని వివరించారు.

కాళేశ్వరం ద్వారా 240 టిఎంసిల నీటి వినియోగం జరుగుతోందని స్పష్టం చేశారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని, అంతమాత్రాన మొత్తం ప్రాజెక్టు కూలినట్లు చెబుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పిల్లర్ కుంగితే 2 రోజుల్లో ఎన్‌డిఎస్‌ఎ వచ్చిందని.. మూడు రోజుల్లోనే నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామని చెప్పారు. కాళేశ్వరం లేకుండా యాసంగిలో పంటలు పండాయని ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం వల్లనే యాసంగిలోనూ పంటలు పండాయని ఉద్ఘాటించారు. ఈ ప్రాజెక్టుకు 3 వనరుల ద్వారా నీటి లభ్యత ఉందని, ఆ నీటితో వేలాది చెరువులు నింపొచ్చు అని పేర్కొన్నారు. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ వరకు నిర్మించినవన్నీ వాడకంలోనే ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరం కింద కాలువ ద్వారానే 90 వేల ఎకరాలకు నీరు అందించొచ్చని అన్నారు. 2014లో తెలంగాణలో కోటి 31 లక్షల 34 వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే, 2023 నాటికి కాళేశ్వరం ద్వారా సాగు విస్తీర్ణం 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు చేరిందని తెలిపారు.

వాప్కోస్ ఎంపిక చేసిన స్థలమే మేడిగడ్డ
ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్లలో అనుమతులు కూడా సాధించలేదని హరీష్ రావు విమర్శించారు. తమ్మిడిహట్టి వద్ద సరైన నీటి లభ్యత లేకపోవటం, ప్రాజెక్టుకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవటం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని మేడిగడ్డకు మార్చామని తెలిపారు. తమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ నిర్మాణం కోసం ప్రభుత్వ పరంగా, రాజకీయంగా అన్ని ప్రయత్నాలు చేసిన్పప్పటికీ అవేమి ఫలించకపోవడంతో ప్రత్యామ్నాయ స్థలం కోసం ఆలోచన చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ ఎంపిక చేసిన స్థలమే మేడిగడ్డ అని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నచోట ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును నాటి కాంగ్రెస్ సర్కారు డిజైన్ చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పకుండా చర్చలు జరిపినట్లు వెల్లడించారు.

భూముల ధరలు పెరగడం, పరిహారం పెంపు వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్ల నుంచి రూ.94 వేల కోట్లకు పెరిగిందని వివరించారు. కానీ కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగానే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. అన్ని అనుమతులతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చెప్పారు. రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రూ.94 వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా అవుతుందని సిఎం రేవంత్‌రెడ్డికి పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డి చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను ప్రదర్శిస్తూ వివరించారు. ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష నాయకులే తెలంగాణ నీళ్ల కష్టాలు కాళేశ్వరం ద్వారానే తీరాయని గతంలో కొనియాడారని గుర్తు చేశారు.

కాళేశ్వరం నీరు ద్వారా పంటలను కాపాడింది కెసిఆరే
కాళేశ్వరం నీరు ద్వారా పంటలను కాపాడింది మాజీ సిఎం కెసిఆరే అని హరీష్‌రావు ఉద్ఘాటించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు గోదావరి జలాల్లో 940 టిఎంసిలు కేటాయించారని, తెలంగాణ గోదావరి జలాలను ఏనాడూ 400 టిఎంసిలకు మించి వాడుకోలేదని చెప్పారు. 2007లో ప్రాణహిత- చేవెళ్లకు శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడక ముందు గోదావరి జలాల సద్వినియోగానికి ఎవరూ కృషి చేయలేదని అన్నారు. గోదావరి నది 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంటే, అందులో 750 కిలోమీటర్లు తెలంగాణలోనే ప్రవహిస్తున్నదని, ఉమ్మడి ఎపి రాష్ట్రంలో 1480 టిఎంసిల కేటాయింపులుంటే, తెలంగాణ వాటా 969 టిఎంసిలు అని చెప్పారు. కానీ, వాస్తవంగా అందులో తెలంగాణ వాడకం ఏనాడూ 400 టిఎంసిలు మించలేదని తెలిపారు.

2014 వరకు తెలంగాణలో గోదావరిపై కట్టిన ప్రాజెక్టులు ఎస్సారెస్పీ, దేవాదుల మాత్రమే అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఉప్పెనలా వస్తే, తలొగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని గుర్తు చేశారు. ప్రాణహిత-చేవెళ్ల నీటి నిల్వ సామర్థ్యం కేవలం 11 టిఎంసిలు మాత్రమే అని, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 141 టిఎంసిలు అని తెలిపారు. రెండింటి మధ్య ఎంత తేడా.. 2014 వరకు కాంగ్రెస్ నాయకులు సర్వే, మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద రూ.2328 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే, పనులు జరగనేలేదని విమర్శించారు. ఇందులో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ.1052 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాహా చేసిందని స్వయంగా కాగ్ తన రిపోర్టులో వెల్లడించిందని తెలిపారు.

ఏడేండ్లలో ప్రాణహిత చేవెళ్లకు కాంగ్రెస్ ఒక్క అనుమతి సాధించలేదు
ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు నాలుగేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అప్పటి కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలికారని.. కనీసం ప్రాజెక్టు అనుమతులు కూడా తీసుకురాలేదని హరీష్‌రావు విమర్శించారు. కేంద్రంలో, మహారాష్ట్రలో, ఎపిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఏడేండ్లలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఒక్క అనుమతి సాధించలేదని చెప్పారు. కానీ కెసిఆర్ ప్రభుత్వం ఒకే ఏడాదిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు సాధించిందని తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించకుండానే.. కాల్వల తవ్వకం పనులు చేపట్టారని తెలిపారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టిఎంసిల నీటి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండేదని,

కానీ కెసిఆర్ ముందుచూపుతో కాళేశ్వరం ద్వారా 141 టిఎంసిల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, మేడారం, మల్కపేట, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బుస్సాపూర్, గంధమల్ల, కొండం చెరువు, భూంపల్లి, మోతె, ధర్మారావుపేట, కాటేవాడి, ముద్దోజివాడి, తిమ్మక్కపల్లి రిజర్వాయర్లలో 141 నీటి నిల్వ సామర్ధ్యం ఉందని తెలిపారు. ఒక్క మల్లన్న సాగర్‌లోనే 50 టిఎంసిల నీటి నిల్వ ఉంటుందని చెప్పారు. ఎస్సారెస్పీకి నీళ్లు రానప్పుడు, కడెం నిండకుండా ఎల్లంపల్లికి కూడా నీళ్లు రానపుడు, మేడిగడ్డలో నీళ్లు ఉంటాయని, ఎక్కడా నీళ్లు లేనపుడు కూడా నీళ్లు లభ్యమయ్యే పాయింట్ మేడిగడ్డ అని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి కల్పతరువు
కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి కల్పతరువని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగునీరు అందిస్తే, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం కింద ఒక్క ఎకరా పారలేదని సిఎం రేవంత్ రెడ్డి అంటే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 50 వేల ఎకరాలు మాత్రమే సాగు అయిందని అంటారని, ఇంకో కాంగ్రెస్ నాయకుడేమో లక్ష ఎకరాలే పారిందని అన్నారని చెప్పారు. ఒక ఏడాది కరువు వస్తే, ఎస్సారెస్పీకి కూడా నీళ్లను రివర్స్ పంపింగ్ చేశామన్నారు. మిడ్ మానేర్ నుంచి ఎల్‌ఎండీకి నీళ్లు తెచ్చి, అక్కడి నుంచి ఎస్సారెస్పీ స్టేజ్ 1కు నీళ్లిచ్చామన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ 2లో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా నీరు అందించామని చెప్పారు. కెపిఆర్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడిందని తెలిపారు.

ఇది వాస్తవమైన రిపోర్టు అని, నీటి పారుదలశాఖ అధికారులిస్తున్న నివేదిక అని వెల్లడించారు. కాళేశ్వరం నీళ్లతో ఇప్పటి వరకు నేరుగా 98,570 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించినట్లు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా నింపిన 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందిందని, కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2, నిజాంసాగర్ నీటితో నింపిన 2143 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 1 లక్షా 67 వేల కొత్త ఆయకట్టు సాగయిందని తెలిపారు. ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2, నిజాంసాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీరందించి 17 లక్షల 8 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్లు పేర్కొన్నారు. కాళేశ్వరం నీళ్లు కూడెల్లి వాగు, హల్దీ వాగుల ద్వారా 66 చెక్ డ్యాములతో మరో 20 వేల 576 ఎకరాలకు సాగునీరందిందని అన్నారు.

జలయజ్ఞం కాదు.. ధనం యజ్ఞం అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును జలయజ్ఞం కాదు.. ధనం యజ్ఞం అని ఆరోపించారని, కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అవినీతిని వెనకేసుకొస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. అప్పుడు కోమటిరెడ్డి, ఉత్తమ్, శ్రీధర్ బాబులు కూడా మంత్రులు ఉన్నారని చెప్పారు. కానీ ఇటీవల ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాణహిత చేవెళ్ల కోసం మేం రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టామని, ఇంకో రూ.20 వేల కోట్లు పెడితే అయిపోతుండె అన్నారని పేర్కొన్నారు. తాను లెక్కలన్నీ తీయిస్తే కాంగ్రెస్ ఖర్చు చేసింది రూ.3700 కోట్లు మాత్రమేనని తేలిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టు ఖర్చు పెరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

భారీ వరద, భూకంపం వచ్చినా బ్యారేజీ చెక్కు చెదరలేదు
మేడిగడ్డ కుంగిన తర్వాత కూడా భారీ వరద, భూకంపం వచ్చినా బ్యారేజీ చెక్కు చెదరలేదని హరీష్‌రావు అన్నారు. ఏడో బ్లాకును నిర్మిస్తే మళ్లీ వాడుకోవచ్చని ఎన్‌డీఎస్‌ఏనే చెప్పిందని గుర్తు చేశారు. ఎన్‌డిఎస్‌ఎ కూడా సిబిఐ, ఇడిలాగా బిజెపికి జేబు సంస్థలా మారిందని ఆరోపించారు. పోలవరంలో డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే వెళ్లని ఎన్‌డిఎస్‌ఎ రాష్ట్రం అడగకపోయినా మేడిగడ్డకు రెండు రోజుల్లోనే వచ్చిందని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్‌పై బురద జల్లేందుకే మేడిగడ్డకు రిపేర్లు చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పోకుండా.. కుంగిన మేడిగడ్డ పిల్లర్‌కు రిపేర్ చేయించాలని కోరారు

కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్తాం
కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు వెళ్తామని హరీషరావు వెల్లడించారు. ప్రాణత్యాగానికే సిద్ధపడిన వాళ్లం, కమిషన్లకు భయపడతామా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లడానికి ఎవరూ భయపడడం లేదని తెలిపారు. తమకేం భయం లేదని, బాజాప్తా విచారణకు హాజరవుతామని స్పష్టం చేశారు. అన్ని విషయాలు చెప్పి కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News