Saturday, June 21, 2025

సన్న వడ్ల బోనస్ కూడా బోగస్ :హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సన్న వడ్ల బోనస్ కూడా బోగస్ అయిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా 1,161 కోట్లు బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గం అని పేర్కొన్నారు. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేదని అన్నారు. రాష్ట్రంలో పొద్దు తిరుగుడు (సన్‌ఫ్లవర్) రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సన్‌ఫ్లవర్ కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం రైతుల పట్ల రేవంత్ రెడ్డి

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అద్దం పడుతున్నదని వ్యాఖ్యానించారు. ఒక సిద్దిపేట జిల్లాలోనే 50 శాతం రైతులకు డబ్బులు ఇవ్వలేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సన్‌ఫ్లవర్ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వేస్తామని ప్రగల్బాలు పలికిన మంత్రి, రెండు నెలలు దాటినా ఇప్పటికీ రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం శోచనీయమని అన్నారు. వెంటనే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 1,116 కోట్లరూపాయల సన్నాల బోనస్ డబ్బులతో పాటు సన్‌ఫ్లవర్ రైతులకు పంట కొనుగోలు డబ్బులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News