ఇంకా నష్టం జరగకముందే అడ్డుకోండి వెంటనే
సుప్రీంకోర్టును ఆశ్రయించాలి.. బనకచర్లను అడ్డుకోవాలి
నెలాఖరు లోగా టెండర్లు పిలవడానికి ఎపి సిద్ధం అవుతుంటే
రేవంత్ నిద్రపోతున్నారు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా?
లేక చంద్రబాబు ప్రభుత్వమా? నదులు, నిధులు ఎపికి..
తెలంగాణకు గుండుసున్నా ఇదే కేంద్రం తీరు పవర్
పాయింట్ ప్రజెంటేషన్లో బిఆర్ఎస్ నేత హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాలను అక్రమంగా తరలించడానికి పోతిరెడ్డిపాడు ఎలా మారిందో గోదావరి జలాలను తరలించుకుపోవడానికి బనకచర్ల అలాంటిదేనని మాజీ మం త్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎపి సర్కారు ముందుకెళ్తుంటే తెలంగాణ సిఎం, ఇరిగేషన్ శాఖ మం త్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గో దావరి -బనకచర్ల లింక్ ప్రాజెక్టులపై తెలంగాణ భవన్లో శనివారం హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇ చ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్ర భుత్వంపై ఆయన పలు విమర్శలు గు ప్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ నకచర్ల ప్రాజెక్టు నిర్మాణ పనులను చు రుగ్గా చేపడుతుంటే, మన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ మా లేక చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్న ప్రభుత్వమా? అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా నిద్రలోనే ఉందని ఆరోపించారు. నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్రెడ్డి ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
నిధులు ఆంధ్రాకే, నదులు ఆంధ్రాకే
కాంగ్రెస్ ప్రభుత్వానికి కెటిఆర్, ప్రతిపక్ష నేతలపై ఎలా కేసులు పెట్టాలనే దానిపైనే ధ్యాస తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలనే ఆలోచన లేదని హరీష్ రావు విమర్శించారు. ప్రతిపక్షాల మీద ఇరిటేషన్ తప్ప, ఇరిగేషన్ మీద దృష్టి లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు పదవుల కోసం తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. గోదావరి బనకచర్లకు టెండర్లు పిలుస్తుంటే సిఎం రేవంత్రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కృష్ణా నీళ్ళు తాత్కాలిక ఒప్పందానికి మించి ఎపి తీసుకుపోతుంటే ఎందుకు మాట్లాడరు..గోదావరి నదిలో తెలంగాణకు ద్రోహం తలపెడితే ఎందుకు స్పందించరు..? అని అడిగారు. గత రెండు కేంద్ర బడ్జెట్లు చూస్తే ఆంధ్రప్రదేశ్కు నిధుల వరద తెలంగాణకు గుండు సున్నా అని వివరించారు. నిధులు ఆంధ్రాకే, నదులు ఆంధ్రాకే తెలంగాణకు సున్నా.. ఇదీ ఢిల్లీ పాలకుల వైఖరి అని ధ్వజమెత్తారు. నిధుల్లో, నదుల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బిజెపి ఎంపీలు నోరు విప్పడం లేదని మండిపడ్డారు.
తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. గోదావరి -బనకచర్లకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిధులు ఇచ్చి సహకరిస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే హక్కు కేంద్రానికి ఎవరు ఇచ్చారని అడిగారు. 2 టిఎంసిల బాబ్లీ నీటి కోసం చంద్రబాబు నాయుడు 2008లో పెద్ద పోరాటం చేశారని, 200 టిఎంసిలతో అక్రమ ప్రాజెక్టు కడుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎంత పోరాటం చేయాలని అన్నారు. మీ దోస్తానా కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడతారా..? అంటూ సిఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ కంటే పది రెట్ల నిధులు ఆంధ్రకి ఇచ్చినమని స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రాలో చెప్పారని గుర్తు చేశారు. కేంద్రంలో పరపతితో చంద్రబాబు పై నుండి కాకుండా పోలవరం నుండి నీళ్ళు మళ్ళించి, కేంద్రం నుండి నదుల అనుసంధానం పేరుతో నిధులు తెచ్చుకున్నారని తెలిపారు. అయినా రేవంత్ రెడ్డికి, మంత్రులకు కదలిక లేదని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికైనా కళ్లు తెరవాలని విజ్ఞప్తి చేశారు.
ఇంకా ఎక్కువ నష్టం జరగక ముందే గోదావరి – బనకచర్లను అడ్డుకోవాలని కోరారు. బిఆర్ఎస్కు రాజకీయాల కంటే రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం అని, బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఏ పోరాటానికైనా తాము మద్దతిస్తామని వెల్లడించారు. ఈ విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటే సహకరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రాకపోతే బిఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటానికి, న్యాయపోరాటానికి శ్రీకారం చుడుతుందని వెల్లడించారు.రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దని కోరారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు బంద్ చేయాలని అన్నారు. రేవంత్రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోకు అంటూ హితవు పలికారు. బిజెపి, కాంగ్రెస్ ఎంపీలు మౌనం వీడి, చంద్రబాబు జల దోపిడిని అడ్డుకోవాలని కోరారు.
వెంటనే సుప్రీంను ఆశ్రయించాలి
బనకచర్ల ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అలాగే గోదావరి -బనకచర్లపై అఖిలపక్షంతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి బనకచర్ల గురించి అడగాలని హరీష్రావు కోరారు.
బనకచర్లపై నేను ప్రజంటేషన్ ఇచ్చాకే మంత్రి ఉత్తమ్ లేఖ విడుదల చేశారు : హరీష్ రావు
బనకచర్ల ప్రాజెక్టు అంశంపై తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతే, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసినట్లుగా విడుదల చేశారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై ఆయన ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. గతంలో కూడా తాను ఒక అంశంపై ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత తేదీ వేసి మీడియాకు లేఖ విడుదల చేశారని ఆరోపించారు. బనకచర్ల విషయంలో తాను శనివారం పిపిటి ఇచ్చిన తర్వాత, శుక్రవారం కేంద్ర మంత్రికి లేఖ రాసినట్లుగా శనివారం విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్కు ధన్యవాదాలు అంటూ హరీష్ రావు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లేఖలు రాసి మీడియాకు ఇవ్వడం కాదు, నిజంగా మంత్రి ఉత్తమ్కు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రిని బనకచర్ల విషయంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు డిమాండ్ చేయమనాలని పేర్కొన్నారు.