రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి తక్షణం వారికి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా, రాయకోడ మండలం యూత్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్ మాజీ ఎంఎల్ఎ క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో హరీశ్రావు సమక్షంలో బి ఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని అన్నారు.- పిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అబద్ధాల్లో సిఎంతో పోటీపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. కాంగ్రెస్ 18 నెలల్లో చేసిందేమీ లేదని అన్నారు. కెసిఆర్ కిట్టు , బతుకమ్మ చీరలు, పంచాయతీల్లో టాక్టర్లకు డీజిల్కు డబ్బులు నిలిపివేశారని అన్నారు.
పోయిన వానకాలం రైతుబంధు ఎగ్గొట్టారు, పోయిన యాసంగి రైతుబంధు ఎగ్గొట్టారన్నారు. రేవంత్ రెడ్డి 15,000 రైతుబంధు ఇస్తానని చెప్పి 12,000 ఇచ్చినందుకు ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు చిల్లర ఉపన్యాసాలు ప్రజలు నమ్మరన్నారు. ఓడిపోతామన్న భయంతోనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టడం లేదన్నారు. బనకచర్ల గురించి కాంగ్రెస్కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా.. ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. 50% రుణమాఫీ కూడా పూర్తి చేయలేదని, రుణమాఫీ ఏ ఊర్లో పూర్తిగా జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు బోనస్ ఎగ్గొట్టారని, కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రోజు ఎరువుల కొరత రాలేదని ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో జనుము, జీలుగు విత్తనాల ధరలు పెంచి దొరకని పరిస్థితి చేశారన్నారు. కనీసం రైతులకు విత్తనాలు సరఫరా చేయడం చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు.
వారం రోజులకు మించి అసెంబ్లీ నడిపే పరిస్థితి లేదని, అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ నిలదీస్తుందని భయంతో పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కచ్చితంగా మళ్ళీ ఎన్నికల్లో గెలిచేది కెసిఆర్ ప్రభుత్వమేనని అన్నారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉంటే మరో 20 ఏళ్ల దాకా ఆ పార్టీ అధికారంలోకి రాదన్నారు. సర్పంచ్, మండల, జిల్లా పరిషత్తులు గెలిచి అందరం కలసి ఐక్యతతో ముందుకు సాగుదామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, కడవెరుగు రాజనర్సు, గుండు భూపేష్, పాల సాయిరాం, జాప శ్రీకాంత్ రెడ్డి, లక్కర్సు ప్రభాకర్ వర్మ, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపిటిసిలు, సర్పంచులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.