Tuesday, July 22, 2025

ముఖ్యమంత్రికి గురుకులాల దీనస్థితి కనిపించడం లేదా..?:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్షాలపై నోరు పారేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోజురోజుకీ దిగజారుతున్నగురుకులాల దీనస్థితి కనిపించడం లేదా..? అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ప్రశ్నించారు. వరుసగా ఫుడ్ పాయిజన్లు జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే మనస్సు కరగడం లేదా..? అని అడిగారు. మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్, నాగల్ గిద్ద మోడల్ పాఠశాలలో, నాగర్ కర్నూల్ జిల్లా, పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాలలో, జగిత్యాల రూరల్ మండలం, లక్ష్మిపూర్ గ్రామం గురుకుల పాఠశాలలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 48 గంటల్లో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనాలు అని విమర్శించారు. కెసిఆర్ గురుతులు చెరిపేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గురుకులాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుండటం చారిత్రక నేరం అని మండిపడ్డారు.

సంకుచిత మనస్తత్వంతో దళిత, గిరిజన, బడుగు, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకునే గురుకులాల ఖ్యాతికి గ్రహణం పట్టిస్తుండటం దుర్మార్గం అని ప్రకటనలో పేర్కొన్నారు. స్వయంగా తానే మానిటరింగ్ చేస్తానని బీరాలు పలికిన రేవంత్ రెడ్డి, మీ మానిటరింగ్ ఏమైంది..? అని సిఎంను నిలదీశారు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండి సిఎం చేస్తున్నదేమిటి..ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప, రాష్ట్రంలో పరిపాలనను చక్కదిద్దడం చేతగాదా..? అంటూ సిఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో పాము కాట్లు, ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్‌లతో 100కు పైగా గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదని నిలదీశారు. కెసిఆర్ గురుకులాల ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరం ఎత్తున నిలబెడితే.. రేవంత్ రెడ్డి అధఃపాతాళానికి దిగజార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోతే సిఎం రాతి గుండె కరుగుతుందని అడిగారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని హరీష్‌రావు బిఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News