Wednesday, July 23, 2025

మాటల్లో ఫేకుడు.. ఢిల్లీకి వెళ్లి జోకుడు: సిఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు.. మాటల్లో ఫేకుడు, ఢిల్లీకి వెళ్లి జోకుడు ఇదేనా సిఎం రేవంత్ రెడ్డికి తెలిసిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు విమర్శించారు. నెల మొదలై 22 రోజులు గడస్తున్నా హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. హోంగార్డులకు వెంటనే వేతనాలు చెల్లించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలోని హోంగార్డు సోదరుల ఆవేదన వినాలని సూచించారు. భద్రాది కొత్తగూడెం, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, జగిత్యాల, వరంగల్, రామగుండం, వికారాబాద్ జిల్లాల్లో పని చేస్తున్నవారికి జీతాలు రాలేదని చెప్పారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చెయ్యాల్సిన దుస్థితి నెలకొందని, ఇఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరని ఆరోపించారు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వీరికి ఏం సమాధానం చెబుతారు..? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి మంత్రిగా ఉన్న హోంశాఖలోనే ఇలాంటి దుర్బర పరిస్థితులా..? అని అడిగారు. వెంటనే హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని, ప్రతి నెలా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని హరీష్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News