Wednesday, June 25, 2025

విజయోత్సవాలు కాదు.. రైతులకు క్షమాపణ చెప్పాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి, 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి,బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు రూ.15,000 చొప్పున ఇస్తామని చెప్పి రూ.12,000కి పరిమితం చేయడం మోసం చేయడమే అని, గత వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టి, యాసంగిలో ఎగ్గొట్టి, ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబరాలు జరపడం రైతులను మోసం చేయడమే అని పేర్కొన్నారు. చెప్పింది కొండంత, చేసింది గోరంత అని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్య పెట్టావు… అధికారంలోకి వచ్చాక నిండా ముంచావు.. రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నావు అని సిఎం రేవంత్ రెడ్డిని అడిగారు.

రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా…కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వనందుకా..రైతు కూలీలందరికి ఆత్మీయ భరోసా అని ఇవ్వకుండా మోసం చేసినందుకా..రుణమాఫీ చారణ చేసి బారాణ మందిని మోసం చేసినందుకా..అన్ని పంటలకు బోనస్ అని, సన్నాలకే పరిమితం చేసినందుకా..1200 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించినందుకా…ప్రీమియం చెల్లించక రైతు బీమా అమలు ప్రశ్నార్థకం చేస్తున్నందుకా..పంట బీమా అని చెప్పి ఉసురుమనిపించినందుకా…దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసినందుకా..లగచర్ల, రాజోలి రైతుల చేతులకు బేడీలు వేసినందుకా…ఏడాదిన్నర పాలనలో ఒక్క చెరువు నింపకుండా, ఒక్క చెక్ డ్యాం కట్టకుండా, కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వనందుకా..ధాన్యం కొనుగోళ్ళు సక్రమంగా జరపనందుకా..జనుము, జీలుగు విత్తనాల ధరలు పెంచి, రైతులకు సకాలంలో అందించినందుకా.. వరంగల్ రైతు డిక్లరేషన్‌ను అటకెక్కించినందుకా…మీ దుర్మార్గ పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా.. అంటూ సిఎం రేవంత్‌రెడ్డికి ప్రశ్నల వర్షం కురిపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రైతుల బతుకులు సంక్షోభంలో కూరుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ పాలనలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్న రైతన్న నేడు ప్రభుత్వ పథకాలు అందక పంట పొలాల్లోనే కుప్ప కూలుతున్నారని వాపోయారు. బిఆర్‌ఎస్‌ది రైతు సంక్షేమ ప్రభుత్వం అయితే, కాంగ్రెస్‌ది రైతు సంక్షోభ ప్రభుత్వం అని పేర్కొన్నారు. కెసిఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే, మీరు ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా ఇచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న రేవంత్‌రెడ్డి జిమ్మిక్కులను రైతులు నమ్మరు అని పేర్కొన్నారు. రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని హరీష్‌రావు హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News