మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు పేర్కొన్నారు. విష జ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థులు ఆస్పత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల్లో పనిచేస్తున్న 2500 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వని దుస్థితి ఉందని అన్నారు.
ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదు..ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించాలని సిఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తానే ఇక నుండి గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయి..కల్తీ ఆహారం పెడితే జైలుకే అని ఇచ్చిన ప్రకటనలు గాలి మాటలయ్యాయని విమర్శించారు. కెసిఆర్ హయాంలో గురుకుల విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే, రేవంత్ రెడ్డి పాలనలో నరక కూపాలుగా మారాయని ఆరోపించారు. నాడు 294గా ఉన్న గురుకులాల సంఖ్యను 1024కి పెంచిన ఘనత కెసిఆర్ది అని పేర్కొన్నారు.
గురుకులాల్లో లక్ష 90 వేలుగా ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆరున్నర లక్షలకు పెంచి కెసిఆర్ నాణ్యమైన విద్యను అందించారని అన్నారు. విద్యపై చేసే వ్యయాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా భావించిన కెసిఆర్ గురుకులాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. కానీ, కాంగ్రెస్ 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారిందని, ఇది మీ అసమర్థత పాలనకు మరో నిదర్శనం అని వ్యాఖ్యానించారు. గురుకులాలంటే సిఎం రేవంత్రెడ్డికి ఎందుకు అంత చిన్న చూపు..? అని అడిగారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి గాడిదప్పిన గురుకుల విద్యా వ్యవస్థపై శ్రద్ధ వహించాలని, తక్షణమే గురుకులాల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. 2500 మంది కాంట్రాక్ట్, ఔర్ సోర్సింగ్ సిబ్బందికి పెండింగ్ జీతాలను చెల్లించాలని హరీష్రావు బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.