Thursday, May 15, 2025

సాగునీరుపై శ్వేతపత్రం

- Advertisement -
- Advertisement -

ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలి
ఏ జ్ఞానంతో కాళేశ్వరం కూలిందని
దుష్ప్రచారం చేస్తున్నారు: హరీశ్‌రావు

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో 48 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి, సాగును బాగు చేశామని సుద్ద పూస లెక్క మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చిత్తశుద్ది ఉంటే 18 నెలల పాలనలో కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ కు నియామక పత్రాలు అందించి, తమ ఘనతగా చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తంటాలు పడ్డారని హరీష్ రావు అన్నారు. నియామక పత్రాలు అందిస్తూ నాలుగు మంచి మాటలు చెప్పాల్సింది పోయి, యదావిధిగా తనదైన శైలిలో అవే అబద్దాలు వల్లె వేశారని విమర్శించారు. బుధవారం రాత్రి ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగాల్లో చేరుతున్న వారిలో ఉత్సాహాన్ని నింపాల్సింది పోయి, వార్నింగ్ ఇచ్చి, భయబ్రాంతులకు గురి చేశారని, అధికారులను ఉరి తీయాలని విజిలెన్స్, ఎన్డీఎస్‌ఏ నివేదికలు చెబుతాయా? ఇది ప్రజాస్వామ్యమా లేక రేవంత్ రాచరిక రాజ్యమా? అని ప్రశ్నించారు. ఇంతకంటే అజ్ఞానం ఉన్న వ్యక్తి సోమాలియా నుంచి అమెరికా వరకు ఎక్కడ వెతికినా కనిపించడు కావచ్చని, రాజకీయ నాయకుల సూచనలు పాటిస్తే,

ఊచలు లెక్కపెడుతారని ఇంజినీర్లను హెచ్చరిస్తున్న రేవంత్ రెడ్డి, ఏ జ్ఞానంతో కాళేశ్వరం కూలిందని దుష్ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. నువ్వేమన్నా ఇంజినీర్ వా?, ఇరిగేషన్ నిపుణుడివా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై తాము చేసిన ఖర్చు ఓసారి లక్ష 50వేల కోట్లు అంటారని, మరోసారి లక్ష కోట్లు అంటారని, ఓ సారి ఒక్క గుంటకు నీళ్లు ఇవ్వలేదంటారని, మరోసారి 50వేల ఎకరాలకే నీళ్లు ఇచ్చినవు అంటారని, నీది నోరా లేక తాటి మట్టనా రేవంత్ రెడ్డి? అని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20లక్షల ఎకరాలకు (కొత్త, స్థిరీకరణ) సాగునీరు అందించినట్లు అసెంబ్లీ సాక్షిగా మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే ప్రకటించారని అన్నారు. మళ్లీ ఇప్పుడు 50వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, బాధ్యత గల పదవిలో ఉండి, రోజురోజుకీ స్థాయి దిగజార్చుతున్నారన్నారు. లక్ష కోట్లు కొట్టుకుపోయాయని, ప్రాజెక్టు కుప్ప కూలిందనే దుష్ప్రచారం పూర్తి అబద్దమని ఎన్‌డిఎస్‌ఎ రిపోర్టు తేటతెల్లం చేసినా రేవంత్ తీరు మారకపోవడం సిగ్గుచేటని ఆరోపించారు. 99శాతం ప్రాజెక్టు బాగుండి, ఒక్క శాతం మాత్రమే మరమ్మతుకు గురి కావడం వాస్తవం కాదా? అని అన్నారు. ఎస్ ఎల్ బీ సీ విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్న ముఖ్యమంత్రికి,

మూడు నెలలు కావొస్తున్నా సొరంగంలో కూరుకుపోయిన వారి జీవితాలు గుర్తుకురావడం లేదా? అని నిలదీశారు. రాజకీయాలు మాట్లాడటమే తప్ప, కుప్ప కూలిన ఎస్ ఎల్ బీ సీ భవితవ్యం గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. 9 ఏళ్ల బిఆర్‌ఎస్ పాలనలో 3900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 12 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తి చేసింది వాస్తవం కాదా?. తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై చర్చకు సిద్ధమా? అని తెలిపారు. ఏడాదిన్నర పాలనలో ఇరిగేషన్ శాఖలో చేసింది చెప్పుకునేది లేక అడ్డగోలుగా మాట్లాడి విలువ మరింత తగ్గించుకున్నారని, రేవంత్ పాలనలో పెరిగింది ఇరిగేషన్ కాదు, ఇరిటేషన్ అన్నారు. ఏడాదిన్నర పాటు ఇరిగేషన్ రంగాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు ప్రాధాన్య రంగమని మాటలు చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ఆరు ప్రాజెక్టులు పూర్తి చేసి, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తమని అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పారని, మీ నిర్లక్ష్యం వల్ల పెద్దవాగు తెగిపోయింది, ఎస్‌ఎల్బీసీ కుప్ప కూలింది. వట్టెం పంపు హౌజ్ మునిగిపోయిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News