సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు.. ఎపి సిఎం చంద్రబాబుకు దాసోహం అయ్యారని మాజీ మంత్రి, సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా చంద్రబాబు ఇంటికి వెళ్ళి బజ్జీలు తిని వచ్చాడని.. అప్పటినుండి చంద్రబాబుకు ఎదురు చెప్పడం లేదని దుయ్యబట్టారు. కృష్ణా నది జలాల్లో మన వాటాలో ఉండే 65 టీఎంసిల నీళ్ళు వాడుకోకుండా.. ఆంధ్రాకు వదిలేస్తున్న చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని హరీష్ రావు మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డిని మించి పోతున్నాడని ఎద్దేవా చేశారు.
హరీశ్ రావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడి సీఎం అయ్యాడు. నేను ఆయనకంటే కంటే తక్కువ అబద్ధాలు ఆడాను.. అందుకే సీఎం కాలేదు అనుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నాడు. ఉత్తమ్ ని మీడియా వాళ్లు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు గురించి అడిగితే నేను ఇంక ప్రిపేర్ అయ్యి రాలేదు అంటున్నాడు. గతంలో కూడా అసెంబ్లీలో ఇలాగే ప్రిపేర్ అయ్యి రాలేదు అన్నాడు. నీటిపారాదుల శాఖ మంత్రిగా ఇంత అసమర్థతగా ఉంటారా?. కేబినెట్ మీటింగ్ లో బనకచర్ల ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడలేదు?. చంద్రబాబు గోదావరి నీళ్లు అక్రమంగా తరలించుకపోతుంటే సుప్రీం కోర్టుకు వెళ్లి ఆపే బాధ్యత మీకు లేదా?. రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ లో ప్రధాన మంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు?” అని నిలదీశారు.