కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బుధవారం లేఖ రాశారు. రిజర్వాయర్ల లో నీటిని సకాలం లో నింపక పోవడం వల్ల పంటల సాగు ముందుకు పోక రైతు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాలోని రిజర్వాయర్లు మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ లను నింపి సుమారు 5లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకెజ్-6 వద్ద గల మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వానాకాలం పంట సీజన్ లో రైతులు ఇటు వర్షాభావం, అటు ప్రాజెక్టుల్లో రిజర్వాయర్ లలో నీటిని సకాలం లో నింపక పోవడం ద్వారా పంటల సాగు ముందుకు పోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం తెలిసిందే.
ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన వచ్చే ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టడం కోసం సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ లను ఆన్ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన శ్రీ పాద ఎల్లంపల్లి రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 20 టి.ఎం.సి లు, ప్రస్తుత సుమారు 14 టి.ఎం.సి ల నీటి లభ్యత ఉన్నది, కడెం నుండి దాదాపు 22,300 క్యూసెక్కుల వరద ఉందని, శ్రీరాం సాగర్ ప్రాజెక్టు లో పూర్తి నీటి సామర్థ్యం 80 టి.ఎం.సీ లు, ప్రస్తుతం సుమారు 45 టి.ఎం.సీల నీటి లభ్యత ఉన్నదన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో ఇన్ ఫ్లోస్ పెరిగిన విషయం మీకు తెలిసిందే దీనిని దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకెజ్ -6 వద్ద గల నంది పంప్ హౌస్ లోని మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించి తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మిడ్ మానేరు, అన్నపూర్ణ (అంతగిరి), రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ లను నింపాలని డిమాండ్ చేశారు.
ఆయా రిజర్వాయర్ల పరిధిలోని చెరువులను, చెక్ డ్యామ్ లను అన్నింటిని నింపి సుమారు 5లక్షల ఎకరాల కు నీరందించేలా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నీటి పంపింగ్ చేపట్టాలని రైతుల పక్షాన కోరారు. లోయర్ మానేరు డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 24 టి.ఎం.సి లు, ప్రస్తుత నీటి లభ్యత 7టి.ఎం.సి లు ఉన్నాయని, మిడ్ మానేరు నుండి లోయర్ మానేరు కు నీటిని నింపి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ -2 లోని అవసరమయ్యే ఆయకట్టుకు ఖరీఫ్ మరియు రబీ పంటకు నీరు అందించి రైతులను అదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత యాసంగి పంట లో కాళేశ్వరం ప్రాజెక్టు లోని రిజర్వాయర్ల పై ఆయకట్టు పరిధిలో 5లక్షల ఎకరాలు సాగు అయిన విషయం గుర్తించి ఈ వానాకాలం పంటకి, వచ్చే యాసంగి పంటకు కూడ సాగు నీరు అందించేల కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలోని అన్ని రిజర్వాయర్ నింపి తద్వారా వాటి అనుసంధానంగా నిర్మించిన కాలువలు, చెరువులు, చెక్ డ్యామ్లన్నింటిని నింపి రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించి రైతు సాగు ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా నీటి పంపింగ్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు.