పాకిస్తాన్ ఇంటలిజెన్స్ అధికారులకు కీలకమైన సమాచారాన్ని రహస్యంగా చేరవేస్తున్న హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తోపాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉందని.. పాకిస్తాన్ కు కీలక ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా… కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా తీసుకుని 2023లో పాకిస్తాన్ను సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె పర్యటన సందర్భంగా, న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ (PHC)లో సిబ్బందిగా పనిచేస్తున్న ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్తో ఆమె సన్నిహిత సంబంధాలను పెంచుకుంది. అయితే, భారత ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించి, మే 13, 2025న డానిష్ ను బహిష్కరించింది. దీంతో జ్యోతిని అతను కొంతమంది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లకు (PIOలు) పరిచయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
భారత్ లోని కీలక ప్రదేశాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు జ్యోతి చేరవేసిందని.. సోషల్ మీడియాలో పాకిస్తాన్ సానుకూల ఇమేజ్ను ప్రదర్శించడానికి ఆమెను చురుకుగా ఉపయోగించుకున్నారని అధికారులు తెలిపారు. దీంతో జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం, 1923లోని సెక్షన్లు 3, 4, 5 కింద కేసు నమోదు చేసి ఆర్థిక నేరాల విభాగానికి అప్పగించారు.