గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా భారీ వర్షం కురుసింది. హఠాత్తుగా వచ్చిన ఈ భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, షేక్ పేట్, గోల్కొండ, టోలీచౌకి, రాజేంద్రనగర్, బండ్లగూడ, నార్సింగి, మణికొండ, ఎర్రగడ్డ, పంజాగుట్ట, శివమ్ రోడ్, ఖైరతాబాద్, చందానగర్, బీహెచ్ఈఎల్, గచ్చిబౌలి, మియాపూర్, మెహిదీపట్నం, వెంకటగిరి, యూసుఫ్గూడ లతో సహా మరిన్ని ప్రాంతాల్లో ఈ వర్షం జోరుగా కురుస్తోంది. హైదరాబాద్లో నైరుతి రుతుపవనాలు ఇప్పటికే విస్తరించాయి .
మూడు రోజుల పాటు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ విభాగం ఓ నివేదికలో పేర్కొంది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్లు వర్షంపై అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. నగర మేయర్ ఫోన్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కమిషనర్ కర్ణన్.. తమ సిబ్బందిని అప్రమత్తం చేసి వాటర్ లాగింగ్ పాయింట్లు, లోతట్టు ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.