అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విషాదకర ప్రమాదం మరవకముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది. ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్.. ఆదివారం ఉదయం డెహ్రాడూన్ నుండి కేదార్నాథ్ వెళ్తుండగా గౌరీకుంద్ అడవుల్లో కుప్పకూలినట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఏడుగురు ఉన్నారు.
త్రిజుగి నారాయణ్-గౌరికుండ్ మధ్య హెలికాప్టర్ సిగ్నల్ కోల్పోయి కనిపించకుండా పోయిందని అదనపు డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) డాక్టర్ వి మురుగేశన్ తెలిపారు. ఆ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయినట్లు తరువాత నిర్ధారించినట్లు చెప్పారు. రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారన్నారు. ఈ ఘటనలో మొదట ఐదుగురు మృతి చెందగా.. గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.