హిందీ ఏ భారతీయ భాషకు వ్యతిరేకం కాదని, అది అన్ని భారతీయ భాషలకు స్నేహితుడిలాంటిదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అంతేకాదు దేశంలో ఏ విదేశీ భాషపై వ్యతిరేకత ఉండరాదని కూడా ఆయన అన్నారు. గురువారం ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అధికార బాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో అమిత్ షా మట్లాడుతూ, స్థానిక భాషలో వైద్య, ఇంజనీరింగ్ విద్యను బోధించడానికి చొరవ తీసుకోవాలని అన్ని రాష్ట్రప్రభుత్వాలను కోరారు. పరిపాలనా వ్యవహారాలను నిర్వహించడానికి భారతీయ భాషలను ఉపయోగించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తుందని కూడా ఆయన చెప్పారు.‘ హిందీ ఏ భారతీయ భాషకు వ్యతిరేకం కాదని నేను మనస్ఫూర్తిగా నమ్మతున్నా. అది అన్ని భారతీయ భాషలకు స్నేహితుడిలాంటిది’ అని అమిత్ షా చెప్పారు.
హిందీ, ఇతర భారతీయ భాషలు కలిసి భాతీయ సంస్కృతి ప్రతిష్ఠను దాని లక్షానికి తీసుకెళతాయని అన్నారు. ప్రతిఒక్కరు కూడా బానిక మనస్తత్వంనుంచి బయటపడాలని, ఒక వ్యక్తి తన సొంత భాషను గొప్పదిగా భావించనంతవరకు లేదా,తన భాషలోతన భావాలను వ్యక్తం చేయనంతవరకు ఆ వ్యక్తి బానిస మనస్తత్వంనుంచి బయటపడలేడని కూడా ఆయన అన్నారు‘ ఏ భాషనూ వ్యతిరేకించరాదు. అలాగే ఏ విదేశీ భాషనూ వ్యతిరేకించరాదు. అయితే తమ సొంత భాషను గొప్పదిగా చెప్పుకోవాలనే కోరిక ప్రతిఒక్కరిలో ఉండాలి. తన సొంత భాషలో మాట్లాడాలనే కోరిక ఉన్నప్పుడే తన సొంత భాష గురించి ఆలోచించాలనే కోరిక ఉంటుంది’ అని హోంమంత్రి అన్నారు. దేశానికి సంబంధించినంతవరకు భాష కేవలం సంభాషించుకునే సాధనం మాత్ర మే కాదని, అది దేశానికి ఆత్మవంటిదని అన్నారు.
‘భారతీయ భాషలన్నిటినీసజీవంగా ఉంచడంతో పాటుగా వాటిని పరిపుష్టం చేయడం ముఖ్యం. రాబోయే రోజుల్లో అన్ని భారతీయ బాషల కోసం ముఖ్యంగా అధికార భాష కోసం మనం అన్నిప్రయత్నాలు చేయాలి’ అని అన్నారు.ఈ సందర్భంగా హోంమంత్రి అధికార భాష శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా దేశవ్యాప్తంగా భారతీయ భాషల అభిమానులను అభినందించారు.1975నుంచి అధికార భాషా విభాగం ప్రయాణంలో ఇది 50వ సంవత్సరమని ఆయన అంటూ, దేశం స్వాతంత్య్ర దినోత్సవ శతాబ్ది వేడులను జరుపుకొనే సమయానికి దేశ ప్రతిష్ఠను తిరిగి మేలుకొల్పడంలో కృషికిగాను దేశ చరిత్రలో అధికార భాషావిభాగం పేరు సువర్ణాక్షరాల్లో లిఖింపబడుతుందని అన్నారు.