బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం హొసకోటె గొట్టిపుర గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఓవర్ ట్రాక్ చేసే క్రమంలో ఆర్టీసీ బస్స వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతులు ఎపిలోని చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
మృతుల్లో 4నెలల చిన్నారి కూడా ఉంది. మృతులు వివరాలు.. వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగుకు చెందిన కేశవులురెడ్డి (45), తమ్ముడి కుమారుడు హిత్విక్ (4 నెలలు), జీడీనెల్లూరు మండలం మారేడుపల్లెకు చెందిన శారద (45), శ్రీరంగరాజపురం మండలం పుల్లూరుకు చెందిన తులసి (21), తిరుపతి జిల్లా రామచంద్రాపురం తిమ్మరాజుపల్లెకు చెందిన ఒంటెల హరిబాబు కుమార్తె ప్రణతి (4) ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.