Saturday, July 5, 2025

భార్యపై అనుమానం.. గొంతునులిమి చంపిన కసాయి భర్త

- Advertisement -
- Advertisement -

భార్యపై అనుమానంతో ప్రతిరోజు గొడవ పడుతున్న భర్త వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత తన ఐదు నెలల కన్నకూతురుపై కనికరం లేకుండా అక్కడే వదిలి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కెఎల్‌ఆర్-ఎన్‌జేఆర్ నగర్‌లో శుక్రవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, కందుకూరు మండలం, ముప్పల గ్రామానికి చెందిన రాంబాబుతో ప్రశాంతి (22) వివాహం ఏడాదిన్నర కిందట జరిగింది. వీరికి ఐదు నెలల పాప ఉంది. రాంబాబు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నెల రోజుల కిందట మేడ్చల్ పట్టణంలోని కెఎల్‌ఆర్-ఎన్‌జెఆర్ నగర్‌లో వారు అద్దెకు ఉంటున్నారు. పెళ్లయిన నాటినుంచి భార్యను రాంబాబు అనుమానంతో వేధిస్తున్నాడు.

ఈ విషయమై తరుచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. కుటుంబ పెద్దలు ఇరువురికి నచ్చచెపుతూ వచ్చారు. పాప పుట్టిన తర్వాత అయినా రాంబాబు మారకపోతాడా అని అంతా భావించారు. అయితే అతడిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగి, రాంబాబు తన భార్య గొంతు నులిమి హత్య చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత తమ ఐదు నెలల పాపను అక్కడే వదిలేసి పారిపోయాడు. శుక్రవారం ఉదయం బంధువులు రాంబాబుకి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో వారు ఇంటికి వచ్చి చూసేసరికి ప్రశాంతి విగతజీవిగా నేలపై పడి ఉంది. ఐదు నెలల పాప తల్లి పక్కన ఏడుస్తూ కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సమాచారం అందుకున్న ఎసిపి శంకర్ రెడ్డి, సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు.

అక్కడి పరిస్థితులను పరిశీలించి, ప్రశాంతిని ఆమె భర్త రాంబాబు హత్య చేసినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణ జరిగి, ప్రశాంతిని భర్త గొంతు నులిమి హత్య చేసినట్టు తేల్చారు. మృతురాలి గొంతుపై ఉన్న గుర్తుల ఆధారంగా ఆమె భర్త గొంతు నులిమి చంపినట్టు భావిస్తున్నామన్నారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరించామని తెలిపారు. ప్రశాంతి తల్లిదండ్రులు రోదిస్తూ తమ కుమార్తెను అనుమానంతోనే హత్య చేశాడని ఆరోపించారు. ఏడాదిన్నర కిందట ప్రశాంతిని రాంబాబుకు ఇచ్చి వివాహం చేశామని, అప్పటినుంచే అనుమానాంతో వేధిస్తున్నాడని ప్రశాంతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానంతో తరుచుగా తమ కూతురుతో రాంబాబు గొడవపడేవాడని అన్నారు. పాప పుట్టాక మారుతాడని కాపురానికి పంపించామని, మనుమరాలికి తల్లి లేకుండా చేశాడని, ఇపుడు ఆ చిన్నారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News