రంగారెడ్డిజిల్లా ఖాజాగూడలోని 27ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టా
చేసిన రెవెన్యూ అధికారులు పిల్ దాఖలు చేసిన నలుగురు
ఎంఎల్ఎలు విచారణకు స్వీకరించిన హైకోర్టు నోటీసులు
జారీ చేస్తూ విచారణ రెండు వారాలకు వాయిదా
మన తెలంగాణ / హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా లో రూ.10 వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్ర భుత్వ భూమిని కాపాడాలంటూ అధికార పార్టీ ఎ మ్మెల్యేలు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఫలితంలేదని, భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వా న్ని ఆదేశించాలంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్లు క లిసి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలు ఖాజాగూడలో ని పాత సర్వే నెంబర్
117/3/1లో ఉన్న 27.18 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు 1996లో సిఖందర్ ఖాన్, సలాబత్ ఖాన్ అనే వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారని పిటీషనర్లు తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. ఖాస్రా పహ ణీ, సేత్వార్లో పోరంబోకు భూమిగా నమోదైనప్పటికీ, సర్వే నెంబర్లలో లోపాలను సరిదిద్దే పేరు తో కొత్త సర్వే నెంబర్ను ఏర్పాటు చేసి 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద అడంగల్ పహాణీలో నమోదు చేశారన్నారు. ప్రస్తుత సర్వే నెంబర్ 27లో ఉన్న ఆ భూమి ప్ర స్తుతం బెవెర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ, సోహి నీ బిల్డర్స్ అధీనంలో ఉందని, అక్కడ ఒక్కో టవర్లో 48 అంతస్థులతో 8 టవర్లను నిర్మిస్తున్నారని చిక్కుడు ప్రభాకర్
వాదించారు.
ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలున్నాయని, భవన నిర్మాణం ఏర్పాటు చేసిన రెడీమిక్స్ ప్లాంటును ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్కు 150 మీటర్ల పరిధిలోనే ఏర్పాటు చేశారన్నారు. ఈ ఏడాది మార్చిలో హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. 2023 జనవరిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నిరభ్యంతర పత్రాన్ని జారీ చేయడంతో దాని ఆధారంగా అదే ఏడాది మార్చి, 2024 అక్టోబర్లో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందన్నారు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేలా సీఎస్ను ఆదేశించాలని చిక్కుడు ప్రభాకర్ వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, రంగారెడ్డి కలెక్టర్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైడ్రాకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.