Friday, May 30, 2025

దళిత బిడ్డలంటే ఇంత వివక్షా?: ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

- Advertisement -
- Advertisement -

దళిత బిడ్డలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత వివక్షనా..? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఎస్‌సి గురుకులాల్లో టాయిలెట్లు, హాస్టల్ గదులను విద్యార్థులతో క్లీన్ చేయించాలని ఆదేశాలు ఇచ్చిన ఐఏఎస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌సి గురుకులాల సెక్రటరీ, అధికారులు, గురుకులాల ప్రిన్సిపాల్స్‌కు ఈమేరకు ఆదేశాలు ఇస్తున్న ఆడియో క్లిప్‌ను కవిత ‘ఎక్స్’ వేదికగా బుధవారం బయట పెడుతూ, సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో విద్యార్థుల దుస్థితిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులాల్లో శానిటేషన్, స్వీపింగ్ పనులు చేసే వర్కర్స్ తొలగింపుపై మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కో గురుకులానికి నెలకు శానిటేషన్, స్వీపింగ్ పనులు చేయడానికి రూ.40 వేల చొప్పున నిధులు ఇచ్చేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల నుంచి ఆ నిధుల విడుదలను ఆపేసి గురుకులాల విద్యార్థులతోనే శానిటేషన్, క్లీనింగ్ పనులతో పాటు కిచెన్ లోనూ పనులు చేయించాలని ఆదేశించడం దారుణమన్నారు.

విద్యార్థులకు శ్రమవిలువ (డిగ్నిటీ ఆఫ్ లేబర్)ను నేర్పుతున్నామనే సాకుతో వారితో వెట్టిచాకిరీ చేయించడం మంచిది కాదని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు గురుకుల పాఠశాల వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ వాచ్ మెన్ ప్రమాదవశాత్తు మరణించారని, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అలాంటి పనులు చిన్నపిల్లలతో చేపిస్తే ఇంకెంత ప్రమాదమో గుర్తించాలన్నారు. 240 గురుకులాల్లో అసిస్టెంట్ కేర్ టేకర్‌లను విధుల నుంచి తొలగించి వారు చేసే పనులను సైతం విద్యార్థులతోనే చేయిస్తున్నారని మండిపడ్డారు. వంటశాల నిర్వహణ, మెస్ పనులు కూడా విద్యార్థులతో చేయించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. వివక్ష నుంచి తప్పించడానికే ప్రభుత్వం గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేసిందని, ఆ స్ఫూర్తిని విస్మరిస్తే ఎలా..? అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ గురుకులాల్లో 1,200 మంది ఉద్యోగులను తొలగించిందని..

ఇది అన్యాయమని మండిపడ్డారు. కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని కల్లబొల్లి మాటలు చెప్తూ గురుకులాల్లో పని చేస్తున్న వారిని తొలగించి విద్యార్థులపై పని భారం మోపడం ఏమిటని ప్రశ్నించారు. గురుకులాల్లో టీచింగ్ స్టాఫ్ తో వార్డెన్ డ్యూటీలు చేయించడం దారుణమని అన్నారు. టీచింగ్ స్టాఫ్‌కు వంతుల వారీగా వార్డెన్ డ్యూటీలు వేస్తుండటంతో వాళ్లు తీవ్ర ఒత్తిడికి, మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. వెంటనే అన్ని గురుకులాల్లో వార్డెన్లను నియమించి టీచింగ్ స్టాఫ్‌ను ఆ ఇబ్బందులను తప్పించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News