ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇప్పటికీ 99 మంది భౌతిక కాయాలను డిఎన్ఎ పరీక్షల ద్వారా గుర్తించారు. వీరిలో 64 భౌతిక కాయాల అవశేషాలను వారి బంధువులకు అప్పగించారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు సోమవారం తెలిపారు. ఈ నెల 12 జరిగిన బోయింగ్ డ్రీమ్లైనర్ విమాన పతనంలో 270 మంది మృతి చెందారు. చాలా శరీరాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. కొందరు కేవలం బూడిద అవశేషాలుగా మారారు. వీరిని గుర్తించడం డిఎన్ఎ పరీక్షలతోనే సాధ్యం అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా ఇప్పటికి దాదాపు వంద మంది అవశేషాల అప్పగింతల ప్రక్రియ పూర్తయిందని ఆసుపత్రి ఉన్నతాధికారులు సోమవారం తెలిపారు.
బాధిత కుటుంబాల ఆవేదన తమకు తెలుసునని, డిఎన్ఎ పరీక్షల ప్రక్రియలోని సంక్లిష్టతలను వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నతాధికారి డాక్టర్ రాకేష్ జోషీ విలేకరుల సమావేశంలో తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియ పూర్తికి అన్ని యత్నాలు చేశామని వివరించారు. అవశేషాల గుర్తింపు ప్రక్రియ తరువాతి న్యాయచట్టపరమైన విషయాలను పరిగణనలోకి తీసుకుని తీరాల్సిందే. సరైన రీతిలోనే బంధువులకు వారి ఆత్మీయులకు భౌతిక కాయాలు అందిచడం చట్టపరమే కాకుండా నైతిక , మాపవీయ అంశాలతో కూడిన విషయం అని ఆయన తెలిపారు. ఈ అంశాలను గమనించి అంతా సంయమనం పాటించాలని కోరారు.