యూఎస్ ఓపెన్కు సన్నాహకంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో మూడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) మహిళల విభాగంలో టైటిల్ను సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో సియాటెక్ 75, 64తో ఇటలీకి చెందిన ఏడో సీడ్ జస్మయిన్ పౌలినిపై విజయం సాధించింది. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరులో ఉత్కంఠత తప్పలేదు. జస్మయిన్, స్వియాటెక్లు పట్టువీడకుండా పోరాడడంతో తొలి సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు.
ఇందులో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన ఇగా సెట్ను దక్కించుకుంది. రెండో సెట్లో కూడా ఆసక్తికర పోరు తప్పలేదు. జస్మయిన్ సెట్ను దక్కించుకునేందుకు తీవ్రంగా పోరాడింది. కానీ ఇగా నిలకడైన ఆటతో ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. అద్భుత ఆటతో అలరించిన ఇగా వరుసగా రెండో సెట్ను గెలిచి సిన్సినాటి ఓపెన్ టైటిల్ను దక్కించుకుంది. పురుషుల విభాగంలో స్పెయిన్కు చెందిన స్టార్ ఆటగాడు కార్లొస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో టాప్ సీడ్ జన్నిక్ సినర్ (ఇటలీ) అర్ధాంతరంగా తప్పుకోవడంతో అల్కరాజ్కు వాకోవర్ లభించింది. దీంతో అతనికి టైటిల్ దక్కింది.